దామరచర్ల, ఆగస్టు 11 : తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాకాలను సద్వినియోగం చేసుకొని రాష్ట్ర పాడి పరిశ్రమను దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలుపాలని రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ సోమా భరత్కుమార్ మహిళా సంఘాలకు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో శుక్రవారం విజయ డెయిరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా లోన్మేళా, అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నేడు రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్వన్గా నిలిచిందని, పాల ఉత్పత్తిలో అనుకున్న స్థాయిలో ఫలితాలను సాధించలేక పోతున్నామన్నారు. రాష్ట్రంలో 1.20కోట్ల లీటర్ల పాలు అవసరముండగా కేవలం 70 లక్షల లీటర్లు మాత్రమే ఉత్పతి చేస్తున్నామన్నారు. పాలను ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని, దాంతో కల్తీపాలు మార్కెట్లోకి రావడంతో ప్రజలు ఆరోగ్య పరంగా సమస్యలు ఎదుర్కుంటున్నారని, వీటిని అరికట్టాలంటే పాల ఉత్పత్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయంతోపాటుగా పాడిపరిశ్రమ అభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక ప్రోత్సాకాలు అందజేస్తున్నారన్నారు. ముఖ్యంగా మహిళలు ఆర్థిక బలోపేతం అయ్యేందుకు విజయ డెయిరీ ఆధ్వర్యంలో బ్యాంకుల సహాయంతో రైతులకు పాడి బర్రెలను అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆరు నెలల్లో ఐదు లక్షల పశువులను రైతులకు అందజేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో లక్ష లీటర్ల కెపాసిటీతో మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్తో ప్యాకెట్ పాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే భాస్కర్రావు మాట్లాడుతూ దినదినం అభివృద్ధి చెందుతున్న దామరచర్ల మండలంలో పాల అవసరాలు పెరుగుతున్నాయని, అందుకనుగుణంగా పాల సరఫ రా పెంచేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జిల్లా కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబందు పథకం మొదటగా కరీంనగర్లో డెయిరీ ఫామ్కు అందజేసినట్లు గుర్తుచేశారు.
వారు ఈ పథకంతో మంచి ఫలితాలు సాధించారన్నారు. మహిళలు సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలపడాలన్నారు. కార్యక్రమంలో యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ చీఫ్ సెక్రటరీ, విజయ డెయిరీ ఎండీ అదర్సిన్హా, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బైరం బుచ్చయ్య, వైస్ చైర్మన్ వీరకోటిరెడ్డి, ఎంపీపీ నందిని, జడ్పీటీసీ లలిత, వైస్ ఎంపీపీ సైదులురెడ్డి, ఎంపీడీఓ జానయ్య, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎస్బీహెచ్ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.