కట్టంగూర్, జూలై 18: వైద్యురాలిగా ఎంతో పేరు తెచ్చుకొని సమాజానికి ఎంతో సేవ చేయాలన్న ఎన్నో కలలు కన్న ఆ వైద్య విద్యార్థిని ఓ యువకుడి వేధింపులను భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. వేధింపులకు కారణమైన ఆ యువకుడు సైతం భయంతో బలవన్మరణానికి పాల్పడటంతో స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఒకే రోజు గ్రామానికి చెందిన యువతీ, యువకులు ఆత్మహత్యకు పాల్పడటంతో నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాలు.. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. మునుకుంట్లకు చెందిన సుక్క లింగయ్య, యాదమ్మ దంపతుల చిన్న కుమార్తె లక్ష్మీ ప్రసన్న (21) సుర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతోంది. కన్నవారి కలలను నిజం చేస్తూ డాక్టర్ చదువుతున్న లక్ష్మీ ప్రసన్నను అదే గ్రామానికి చెందిన చిలుముల రామ్ చరణ్ (25) ప్రేమిస్తున్నానంటూ కొంత కాలంగా వేధిస్తున్నాడు. పలు మార్లు లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులు, రామ్ చరణ్ను మందలించినా అతనిలో మార్పు రాలేదు. చరణ్ వేధింపులను తట్టుకోలేక.. తీవ్ర మనోవేదనకు గురైన లక్ష్మీ ప్రసన్న శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

భయంతో చరణ్ ఆత్మహత్య
తనవల్లే లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్యకు పాల్పడిందనే విషయం రామ్ చరణ్కు తెలియడంతో భయాందోళనకు గురయ్యాడు. శుక్రవారం రాత్రి గ్రామ శివారులోని తండ్రి సమాధిపై రక్తంతో తన పేరుతో పాటు చిన్నారి అనే పేర్లు రాశాడు. అనంతరం పక్కనే ఉన్న తాటి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన ఇద్దరూ ఒకే రోజు ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత, విషాద ఛాయలు అలుముకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి లక్ష్మీ ప్రసన్న మృతదేహానికి శనివారం చరణ్ మృతదేహానికి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టు మార్టం నిమిత్తం లక్ష్మీ ప్రసన్న మృతదేహాన్ని శుక్రవారం నల్లగొండకు, చరణ్ మృతదేహాన్ని శనివారం నకిరేకల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాలిగౌరరం సీఐ రాజశేఖర్, కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. లక్ష్మీప్రసన్న తండ్రి లింగయ్య ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. వైద్యురాలిగా ఎంతో ఎదగాల్సిన కు మార్తె ఆత్మహత్య ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. మరో వైపు ఇప్పటికే తండ్రిని కోల్పోయిన రామ్ చరణ్ కుటుంబంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలి అక్క లక్ష్మీ ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రవీందర్ తెలిపారు. అలాగే తన కుమారుడి మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని రామ్ చరణ్ తల్లి జానకమ్మ పోలీసులకు తెలిపారు.