మాడ్గులపల్లి, మార్చి 22 : పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులను దూరం చేయవచ్చని రాష్ట్ర వైద్యశాఖ జాయింట్ డైరెక్టర్ శివబాలాజీరెడ్డి అన్నారు. మండలంలోని ఇందుగుల గ్రామాన్ని శుక్రవారం ఆయన సందర్శించి రోగాల బారిన పడిన బాధితులతో మాట్లాడారు. అనంతరం వైద్యాధికారులతో మాట్లాడుతూ గ్రామంలో రోగాల బారిన పడిన బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. బాధితులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా గ్రామంలోని పల్లె దవాఖానలో అన్ని పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందించాలని సూచించారు.
గ్రామంలో తాగునీటి శాంపిల్స్తోపాటు బాధితుల రక్త నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరుచాలని, డ్రైనేజీల్లో చెత్తాచెదారం లేకుండా చూడాలని, దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్టేట్ ఎపిడమాలజిస్ట్ మోహన్, మైక్రో బయాలజిస్ట్ ముక్కంఠేశ్వర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్రెడ్డి, డీఎంఓ దుర్గయ్య, వైద్యులు ఫిర్దోస్, ఇక్తియాజ్, ల్యాబ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇందుగుల గ్రామంలో వ్యాధుల బారిన పడిన బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. వైద్యాధికారులు ఇందుగుల గ్రామాన్ని సందర్శించి బాధితులకు అన్ని రకాల వైద్య సదుపాయం అందించి రోజువారి నివేదికను పంపించాలన్నారు. గ్రామంలో పరిస్థితులు మెరుగయ్యే వరకు వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.