కోదాడటౌన్, ఫిబ్రవరి 19 : కోదాడ కోర్టు పరిధి లోని సమస్యల పరిష్కారానికి, భవన నిర్మాణానికి నిధుల మంజూరుతో పాటు ఇతర డిమాండ్లను నెరవేర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటానని హైకోర్టు జడ్జి, జిల్లా పోర్ట్ పోలియో జడ్జి రాధారాణి అన్నారు. కోదాడ బార్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు ఆదివారం ఆమె కోదాడ కోర్టును సందర్శించారు. కోర్టు పరిసరాలు, పాత కోర్టు స్థలం, బార్ అసోసియేషన్, న్యాయమూర్తుల నివాస భవనాల నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఆమె పరిశీలించారు. స్థానిక న్యాయవాదులు ఆమెను కలిసి తమ సమస్యలు వివరించారు. కోర్టు భవనంలో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. సబ్ కోర్టు ఏర్పాటు కాకపోవడంతో న్యాయవాదులు, కక్షిదారులు ఇబ్బందులు పడుతున్నారని, గతంలో మాదిరిగానే మేళ్లచెర్వు కోర్టును కోదాడ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. దీనికి స్పందించిన జడ్జి హైకోర్టు పరిధిలో ఉన్న అంశాలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం జడ్జి రాధారాణిని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపల్ జడ్జి గౌతమ్ ప్రసాద్, కోదాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్యాం సుందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవబత్తిని నాగార్జునరావు, ఉపాధ్యక్షుడు షేక్. అబ్దుల్ రహీం, ప్రధాన కార్యదర్శి సిలివేరు వెంకటేశ్వర్లు, సీనియర్ న్యాయవాదులు ఎలక సుధాకర్రెడ్డి, కేఎల్ఎన్ ప్రసాద్, మూర్తి, చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి పాల్గొన్నారు.
కోర్టు భవనం, సబ్జైల్ సందర్శన
హుజుర్నగర్ : పట్టణంలోని కోర్టు భవనాన్ని, సబ్జైలును హైకోర్టు న్యాయమూర్తి రాధారాణి ఆదివారం పరిశీలించారు. కోర్టు భవనంలోని వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. సబ్జైల్లో ఖైదీలతో ముచ్చటించారు. కార్యక్రమంలో వెంట సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాంకుమార్, జూనియర్ సివిల్ జడ్జి సాంకేతి మిత్ర, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి జక్కుల నాగేశ్వర్రావు, న్యాయవాదులు, కోర్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.