సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)ని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆదేశించారు. మురుగునీటి శుద్ధికి ఎస్టీపీలను, పారిశ్రామికవాడల్లోనూ కామన్ ఇంఫ్ల్లుయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (సీఈటీపీ) నెలకొల్పి అంతర్జాతీయ స్థాయిలో కాలుష్య నియంత్రణ ప్రమాణాలు పాటించేలా చూడాలని స్పష్టం చేశారు. మంగళవారం అరణ్యభవన్లో ఎస్టీపీ, సీఈటీపీల ఏర్పాటు, జల, వాయు, శబ్ద కాలుష్య నియంత్రణ – నివారణ , ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ , కాలుష్య కారక పరిశ్రమలపై తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హరితహారం లాంటి కార్యక్రమాలతో తెలంగాణలో గ్రీన్ కవర్ను పెంచి రాష్ర్టాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపినట్లుగానే కాలుష్య నియంత్రణలోనూ ముందుండేలా పకా ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు. సీఎం కేసీఆర్ పర్యావరణ పరిరక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారని, ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించే పరిశ్రమల మూసివేతకు కూడా వెనుకడుగు వేయరాదన్నారు.
రాష్ట్రంలో ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని మంత్రి తెలిపారు. అలాగే జీహెచ్ఎంసీ, టీఎస్ పీసీబీ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీలు సమష్టిగా పనిచేస్తూ నీటి వనరులలోకి ప్రవేశించే మురుగునీటిని శుద్ధి చేసేలా కృషి చేయాలన్నారు. హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ- వెహికల్ పాలసీని ప్రవేశపెట్టడంతో పాటు పర్యావరణ హిత వాహనాలను వాడేలా వాహనదారులను ప్రోత్సహించేందుకు సబ్సిడీ ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రహదారుల అభివృద్ధి, 216 రహదారులకు బ్లాక్ టాపింగ్ చేశామన్నారు. ఈ సందర్భంగా అన్ని రకాల కాలుష్య కారకాలు, నియంత్రణకు పీసీబీ తీసుకుంటున్న చర్యలను పీసీబీ అధికారులు మంత్రికి వివరించారు.
రూ. 3,866 కోట్ల అంచనా వ్యయంతో 1259 ఎంఎల్డీ మురుగునీటిని శుద్ధి చేసేందుకు 31 ఎస్టీపీల నిర్మాణ పనులు ప్రారంభించామని అధికారులు తెలిపారు. వీటి నిర్మాణం పూర్తయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 100 శాతం మురుగునీరు శుద్ధి అయ్యే అవకాశం ఉన్నదన్నారు. దాంతో మూసీనదితో పాటు చెరువులు, కుంటల్లో మురుగునీరు చేరే అవకాశం ఉండదని మంత్రికి అధికారులు వివరించారు. ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యానికి కారణమవుతున్న 12 స్టోన్ క్రషర్స్ సీజ్ చేసి, జరిమానా విధించినట్లు వివరించారు. చౌటుప్పల్, సూర్యాపేట ప్రాంతాల్లో రసాయన (ద్రవ , ఘన) వ్యర్థాలను నీటి వనరుల్లో పారబోస్తూ జల కాలుష్యానికి కారణమవుతున్న పది పరిశ్రమలపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. రాంకీ సంస్థ ఆధ్వర్యంలో జవహర్నగర్ డంప్యార్డ్ వ్యర్థ జలాలను శుద్ధి చేసేందుకు ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. దీని వల్ల చెరువులు, భూగర్భ జలాల కాలుష్యాన్ని నియంత్రించనున్నట్లు మంత్రికి పీసీబీ అధికారులు వివరించారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్కుమార్, పీసీబీ సీఈ రఘు, ఎస్ఈఎస్ డి.ప్రసాద్, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్లు, అధికారులు పాల్గొన్నారు.