మఠంపల్లి, డిసెంబర్ 30 : కొత్త సంవత్సరం, వైకుంఠ ఏకాదశి సందర్భంగా మట్టపల్లి ఆలయం ముస్తాబవుతున్నది. లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశమున్నందున దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ఉత్తర ద్వారం, అదనపు క్యూలైన్ల నిర్మాణం, ఆలయ గోపురాలు, పరిసరాలకు విద్యుద్దీప అలంకారాలు చేసే పనులు జరుగుతున్నాయి. జనవరి 2న తెల్లవారుజాము 5గంటల నుంచే స్వామి ఉత్తర ద్వార దర్శన భాగ్యం భక్తులకు కలుగనున్నది.
ప్రత్యేక కార్యక్రమాలు
ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని మట్టపల్లి ఆలయంలో జనవరి 1న సాయంత్రం 5గంటలకు మంగళ వాయిద్యం, 6గంటలకు వేదమంత్ర పఠనం, రాత్రి 8గంటలకు కూచిపూడి నృత్య ప్రదర్శన, రాత్రి 9గంటలకు హరికథ, 2న తెల్లవారుజామున 3గంటలకు ప్రాతఃకాలార్చన, స్వామి వారి సుప్రభాతం, 4గంటలకు ధృవ స్వామి వారికి అభిషేకం, 5గంటలకు స్వామి వైకుంఠ ద్వార దర్శనం, 6గంటలకు వేదమంత్ర పఠనం, 7గంటలకు నాదస్వర కచేరీ, 8గంటలకు వైకుంఠ ఏకాదశి మహత్యం, ఉదయం 10గంటలకు ఆలయంలో స్వామి వారికి లక్ష ఆరెపత్రి పూజ, 11గంటలకు స్వామి వారి గ్రామోత్సవం, మధ్యాహ్నం 1గంటకు స్వామి వారి ఆలయ ప్రవేశం, 6గంటలకు భక్తి సంగీతం, సాయంత్రం 8గంటలకు బుర్రకథ, మట్టపల్లి క్షేత్ర మహత్యం తదితర కార్యక్రమాలను శాస్ర్తోక్తంగా నిర్వహించనున్నారు.