సూర్యాపేట, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ప్రస్తుత సర్కారు నిలిపివేయడంతో పలు అభివృద్ధి పనులు ఆగిపోయాయి. మాజీ సీఎం కేసీఆర్ సూర్యాపేట మున్సిపాలిటీకి రూ.50 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చారు. తిరుమలగిరి, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల పురపాలికలకు రూ.25 కోట్ల చొప్పున వంద కోట్ల రూపాయలు విడుదల చేశారు.
ఆ నిధులతో పనులు చేసేందుకు అన్ని చోట్లా టెండర్లు పిలిచారు. సూర్యాపేటలో రూ.3కోట్ల పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే.. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభమైన పనులు మాత్రమే కొనసాగిస్తూ మిగతా వాటిని నిలిపివేసింది. అలాగే సూర్యాపేట మున్సిపాలిటీకి రూ.30 కోట్ల టీఎఫ్డీసీ నిధులు వస్తే.. ఇందులో రూ.10 కోట్ల పనులు నిలిచిపోయాయి. మొత్తంగా సూర్యాపేట జిల్లాలో గత సర్కారు మంజూరు చేసిన 157 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఆగిపోయాయి.
సమైక్య రాష్ట్రంలో వెనుకబాటుకు గురైన పట్టణాలు, పల్లెలను ప్రగతి పథంలో నడిపేందుకు కేసీఆర్ ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిన నిధులు మంజూరు చేసింది. ప్రధానంగా మున్సిపాలిటీల అభివృద్ధి కోసం పట్టణ ప్రగతి పేరిట నెలనెలా కోట్లాది రూపాయలు విడుదల చేసింది. దాంతోపాటు అనేక రకాల నిధులతో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కొత్త రోడ్లు, అవసరమున్న ప్రతి చోటా డ్రైనేజీ కాల్వలు, రహదారులకు ఇరువైపులా పచ్చదనాన్ని వెదజల్లే మొక్కలు, ఓపెన్ జిమ్లు, పార్కులు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసింది.
సూర్యాపేట కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపాలిటీల పరిధి శివారు ప్రాంతాల్లోని రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలతోపాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు హామీ ఇచ్చారు. ఆ వెంటనే సూర్యాపేట మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, మిగతా నాలుగు పురపాలికలకు రూ.25కోట్ల చొప్పున 100 కోట్లకు సంబంధించి జీఓలు విడుదల చేశారు. అలాగే.. అన్ని మున్సిపాలిటీల్లో టెండర్లు సైతం పిలిచారు. ఎన్నికల కోడ్ రావడంతో పనుల ప్రారంభం ఆగిపోయింది.
అప్పటికే సూర్యాపేటలో 10 కోట్ల రూపాయల పనులకు వర్క్ ఆర్డర్లు ఇవ్వగా రూ.3 కోట్ల పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన ఏడు కోట్లతోపాటు మిగతా నాలుగు మున్సిపాలిటీల్లో పనులన్నీ టెండర్ దశలో ఉన్నాయి. తదనంతరం ఎన్నికలు రావడం ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం విదితమే. అప్పటికే మంజూరైన నిధులతో మౌళిక సదుపాయల కల్పన జరుగుతుందని అందరూ భావించినప్పటికీ రేవంత్రెడ్డి ప్రభుత్వం నిధులను నిలిపివేసింది.
దాంతో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో రూ.147 కోట్ల పనులు నిలిచిపోగా.. గతంలో సూర్యాపేట పట్టణానికి వచ్చిన రూ.30 కోట్ల టీఎఫ్డీసీ నిధుల్లో పనులు ప్రారంభం కాని రూ.10 కోట్లు కూడా ఆగిపోయాయి. మొత్తం కలిపి రూ.157 కోట్లు నిలిపివేయడంతో పట్టణాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కొత్త ప్రభుత్వం మళ్లీ నిధులు మంజూరు చేసి పట్టణాల్లో అభివృద్ధిని కొనసాగించాలని పలువురు కోరుతున్నారు.