పెన్పహాడ్, మే 02 : మనవడికి, మనుమరాలికి ఈత నేర్పించడానికి వెళ్లి కాలుజారి బావిలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన పెన్పహాడ్ మండల పరిధిలోని మాచారం ఆవాసం అనీరెడ్డిగూడెం గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గడ్డం సంజీవ రెడ్డి (53) శుక్రవారం సాయంత్రం తన మనవడు, మనుమరాలుకి ఈత నేర్పించేందుకు భార్య నాగమ్మతో పాటు గ్రామంలోని ఐతగోని సైదులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఇద్దరు పిల్లలకు ఈత నేర్పించి వారిని ఒడ్డుకు చేర్పి మరళా కాళ్లు శుభ్రం చేసుకోవడం కోసం సంజీవరెడ్డి బావి వద్దకు వెళ్లగా కండ్లు తిరగడంతో బావిలో పడి గల్లంతు అయ్యాడు. బావిలో ఉన్న నీళ్లను మోటార్ల సహాయంతో తీయగా శనివారం ఉదయం 6.40 గంటలకు ఆయన మృతదేహం లభించింది. సంజీవ రెడ్డి కొడుకు గడ్డం అరవింద్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కాస్తల గోపికృష్ణ తెలిపారు.