నీలగిరి, మార్చి 18 : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీర వనిత మల్లు స్వరాజ్యం జీవితం అందరికీ ఆదర్శనీయమని, ఆమె అందించిన పోరాట స్ఫూర్తిని, మానవత విలువలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎం వి ఎన్ విజ్ఞాన కేంద్రం కన్వీనర్ అక్కెనపల్లి మీనయ్య అన్నారు. మల్లు స్వరాజ్యం 4వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఆమె మనవడు, ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ మల్లు అరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండలోని సత్యవతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో సూర్యాపేట జిల్లాకు చెందిన నిరుపేద జుట్టుకొండ వీరయ్యకు ఉచిత మోకాలు చిప్ప మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్బంగా మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మల్లు స్వరాజ్యం జీవితమంతా త్యాగాలమయం అన్నారు. జీవితాంతం నిరుపేదల అభ్యున్నతి కోసం పరితపించినట్లు తెలిపారు. ఆమె చరిత్రను మర్చిపోకుండా భవిష్యత్ తరాలకు అందించేందుకు ఆమె పేరుతో నిర్వహించే సేవా కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. ప్రతీ యేటా వర్ధంతి సందర్బంగా నిర్వహిస్తున్న ఉచిత మోకాలు మార్పిడి ఆపరేషన్ ను అర్హులు సద్వినియోగించుకోవాలని కోరారు.

మల్లు స్వరాజ్యం జీవితం ఆదర్శనీయం : అక్కెనపల్లి మీనయ్య
మల్లు స్వరాజ్యం మనవడు, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు మల్లు అరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. మల్లు స్వరాజ్యం తన జీవితాన్ని సమాజంలోని అట్టడుగు వర్గాల కోసం ధారపోసిన వీర వనిత అన్నారు. మహిళా హక్కులు, ప్రజల హక్కులు, పేదల భూముల కోసం చివరి వరకు పోరాడరన్నారు. ఆమె స్ఫూర్తితో ప్రతీ యేటా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంపూర్ణ సహకారం అందిస్తున్న సత్యవతి హాస్పిటల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సత్యవతి హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రాంమనోహర్ మాట్లాడుతూ.. స్వరాజ్యం స్ఫూర్తిగా ఎన్నో కార్యక్రమాలు ప్రతీ సంవత్సరం చేయడం చాలా సంతోషకరమన్నారు. అందులో తమ హాస్పిటల్ భాగస్వామ్యం కావడం ఇంకా సంతోషంగా ఉందన్నారు. అదే స్ఫూర్తితో తాము కూడా ఉచిత మెడికల్ క్యాంప్లు, నిరుపేదలకు ఉచిత సర్వీస్ అందిస్తున్నట్లు తెలిపారు.

మల్లు స్వరాజ్యం జీవితం ఆదర్శనీయం : అక్కెనపల్లి మీనయ్య
ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రం కార్యనిర్వాహక కార్యదర్శి పి.నర్సిరెడ్డి మాట్లాడుతూ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రతినెల మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉచిత వైద్య సేవలే కాకుండా విద్యార్థులకు కరాటే, ఉచిత కంప్యూటర్ శిక్షణ, మహిళలకు టైలరింగ్, క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తమ సంస్థ చేస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సామాజిక సేవకు కృషి చేస్తున్న ఎంజీయూ తెలుగు విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ అనిత, చర్లపల్లి రెసిడెన్షియల్ కాలేజీ ఎకనామిక్స్ లెక్చరర్ షేక్ సుల్తానాను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చైతన్య, డాక్టర్ సంపద, సత్యవతి వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ, కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్యాకల్టీ శంకర్ పాల్గొన్నారు.