రామగిరి, అక్టోబర్ 17 : స్వరాష్ట్రంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నది. ప్రభుత్వం అధిక నిధులు ఇస్తుండడంతో కొత్త రూపు సంతరించుకుంటున్నది. ఆధునిక వసతులతో భవన నిర్మాణాలు చేపట్టగా.. కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. పాత కోర్సుల్లో సీట్ల పెంపుతో మరింత మంది విద్యార్థులకు చదువుకునే అవకాశం దక్కింది. విద్యార్థులకు పరిశోధన అవకాశాలు కల్పిస్తుండడంతో ఇప్పటికే ఎంతో మంది పీహెచ్డీ పట్టాలు పొందారు. టీఎస్ ఎడ్సెట్ నిర్వహణ, అడ్మిషన్ల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించి శభాష్ అనిపించుకుంటూ ఇతర వర్సిటీలకు దీటుగా ఎంజీయూ ముందుకు సాగుతున్నది. వర్సిటీలో ప్రతి డిపార్ట్మెంట్లో డిజిటల్, వర్చువల్ తరగతులను వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ వాల్యుయేషన్, డిజిలాకర్తో విద్యార్థులకు సర్టిఫికెట్లు, పలు ఉన్నత సంస్థలతో ఉన్నత విద్యకు పరస్పర ఒప్పందాలు చేయడంతో ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు.
ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్రెడ్డి విద్యార్థులకు పలు వసతులను అందుబాటులోకి తెచ్చారు. 2022-23 విద్యా సంవత్సరంలో ఎమ్మెస్సీ బోటనీ కోర్సు ప్రారంభించారు. వర్సిటీలో ఇప్పటికే ఉన్న 14కోర్సుల్లో అదనంగా 140 సీట్లు పెంచారు. ఈ విద్యా సంవత్సరం ఇంజినీరింగ్లో సీఎస్ఈ కోర్సును 60 మంది విద్యార్థులతో ప్రారంభించగా అడ్మిషన్లు పూర్తయ్యాయి. అదేవిధంగా ఎంఏ సైకాలజీ కోర్సును 50 మంది విద్యార్థులతో అవకాశం కల్పించారు. ఇప్పటికే 60 కిలో వాట్స్తో సోలార్ పవర్ను ఉత్పత్తి చేస్తున్నారు. అదే స్థాయిలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ కోర్సు విద్యార్థులకు విండ్ పవర్ను పరిచయం చేసేలా ఒక కిలో వాట్స్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన విండ్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తూ ఇతర వర్సిటీలకు రోల్మోడల్గా నిలిచేలా కృషి చేస్తున్నారు.
యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీలో తెలంగాణలో ఇతర వర్సిటీల్లో అందుబాటులో లేనివిధంగా ‘జెగేట్’తో ఆన్లైన్లో 50వేల జర్నల్స్ చూసుకునే అవకాశం కల్పించారు. అదేవిధంగా లైబ్రరీలో ఉచిత ఇంటర్నెట్తో 20 కంప్యూటర్లను అందుబాటులో ఉంచారు. ప్రభుత్వం విడుదల చేసిన పలు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందుబాటులోకి తేవడంతో విద్యార్థులతో నిత్యం లైబ్రరీ సందడిగా ఉంటున్నది.
ప్రస్తుతం అరకొర వసతులతో ఆర్ట్స్ బ్లాక్లో కొనసాగుతున్న ఎంజీయూ పరీక్షల విభాగాన్ని ఈ నెల 14న నూతన అధునాతన భవనంలోకి మార్చారు. 1500 మంది కూర్చొని సమావేశాలు జరిపేలా ఆంపి థియేటర్ను అందుబాటులోకి తెచ్చారు. నూతన ఇంజినీరింగ్ కళాశాల భవన నిర్మాణం పూర్తికాగా.. త్వరలో ప్రారంభం కానున్నది.
టీఎస్ పీఈసెట్ (తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్)ను ఎంజీయూ ఆధ్వర్యంలో ఆరు సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. దీంతో ఈ విద్యా సంవత్సరం టీఎస్ ఎడ్సెట్ (తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఎంజీయూకు అప్పగించింది. పరీక్షతోపాటు అడ్మిషన్ల ప్రక్రియను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.