నల్లగొండ, జనవరి 10 : జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ద్వారా అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంక్ లింకేజీ, స్త్రీ నిధి లాంటి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేసి లక్ష్యం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఅర్డీఏ ద్వారా అమలు చేస్తున్న ఆయా కార్యక్రమాలను సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొన్ని మండలాల్లో అభివృద్ధి పనులు వెనుకబడి ఉన్నాయని, అందుకు గల కారణాలను ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీల హాజరు శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాంపల్లి మండలంలో సరాసరి కూలీలకు అతి తకువ వేతనానికి గల కారణాలు తెలుసుకొని పనులు గుర్తించి కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని ఏపీడీని ఆదేశించారు. మిర్యాలగూడ మండలంలో సరాసరి లేబర్ టర్నౌట్ తకువగా ఉందని, దాన్ని మెరుగు పర్చాలని కోరారు.
మొబైల్ ద్వారా హాజరు శాతం, దాని ఫలితాల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామాల వారీగా ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ సెక్రటరీలు, అవసరమైతే మేట్స్లలో చదువుకున్న వారు మొబైల్ వాడకంలో పరిజ్ఞానం ఉన్న వారి చేత మొబైల్ యాప్లో హాజరు వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, సంపద వనాలు, సీఎం గిరి వికాసం, బడ్జెట్తో పాటు బ్యాంకు లింకేజీ వివరాలు, శిక్షణ కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంత ప్రజలు బాగుపడేలా జీవనోపాధులు కల్పించాలని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, డీఅర్డీఓ కాళిందిని, ఏపీడీలు, ఏపీఎంలు పాల్గొన్నారు.