యాదగిరిగుట్ట, జనవరి 6 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో ఆళ్వారు దివ్య ప్రబంధ అధ్యయనోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అధ్యయనోత్సవాల్లో ఐదో రోజు శుక్రవారం నాలాయిర దివ్యప్రబంధ సేవా కార్యక్రమం నిర్వహించారు. స్వామి వారు ఉదయం వటపత్రశాయిగా, రాత్రి పరమపదనాథుడిగా(వైకుంఠనాథుడు) దర్శనమిచ్చారు. వటపత్రశాయి, వైకుంఠనాథుడి పురప్పాట్ సేవలను ఘనంగా నిర్వహించారు. 12మంది ఆళ్వారులు రచించిన దివ్య ప్రబంధ పారాయణాలను అర్చకులు, పారాయణదారులు పఠించారు. ఈ సందర్భంగా అర్చకులు, పారాయణికులు స్వామివారి నవ కలశాభిషేకం, మూలమంత్ర హోమాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు.
ఉదయం వటపత్రశాయిగా..
యాదగిరిగుట్ట ప్రధానాలయంలో నిత్యారాధనల అనంతరం అధ్యయనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. దివ్య ప్రబంధ పారాయణం పారాయణికులచే నిర్వహించారు. అనంతరం అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారిని వటపత్రశాయిగా అలంకరించి భక్తుల దర్శనార్థం ప్రధానాలయ మాఢవీధుల్లో ఊరేగించారు. పశ్చిమ రాజగోపురం గుండా మాఢవీధుల్లోకి పురప్పాట్ సేవ నిర్వహించారు. అనంతరం ఉత్తర రాజగోపురం గుండా మొదటి ప్రాకార మండపంలోకి సేవ సాగింది.
అలంకార విశిష్టత : సకల చరాచర ప్రపంచమంతా నీటిలో ముగిని ఉన్నప్పుడు తిరిగి సృష్టిని ప్రారంభించాలని భగవంతుడు సంకల్పించాడు. ఈ క్రమంలో నీటిపై తేలియాడుతున్న మర్రి ఆకును సృష్టించి దానిపై బాల ముకుందుడిగా శయనించిన తీరే వటపత్రశాయి స్వరూపం. పద్నాలుగు లోకాల్లోని సమస్త ప్రాణకోటిని తన కడుపులో నిలుపుకొని బొటన వేలితో అమృతధారలను తన ముఖారవిందం ద్వారా అందజేస్తూ జగద్రక్షకుడైన పరమాత్ర వటపత్రశాయిగా దర్శనమిచ్చి సృష్టిని తిరిగి ప్రారంభించాడు. బ్రహ్మాది దేవతలతో జీవకోటి మనుగడకు దిశానిర్దేశం చేసిన తీరు ఈ అలంకార సేవతో దర్శించవచ్చు.
రాత్రి వైకుంఠనాథుడిగా..
ఆలయంలో నిత్యారాధనల అనంతరం అధ్యయనోత్సవాల్లో భాగంగా సాయంత్రం స్వామి వారిని పరమపదనాథుడిగా(వైకుంఠనాథుడు) అలంకరించి సేవోత్సవం చేపట్టారు. ప్రధానాలయంలో నమ్మాళ్వారుకు పరమపదోత్సవాన్ని గావించి, ద్రావిడ ప్రబంధ సేవాకాలం పారాయణిక స్వాములచే, అర్చక స్వాములచే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామిని దివ్య మనోహరంగా వైకుంఠనాథుడిగా అలకరించి భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభివాణీదేవి, జార్ఖండ్ లెజిస్టేటివ్ అసెంబ్లీ ప్రెస్ అడ్వైజరీ కమిటీ సభ్యులు వినయ్కుమార్, నవీన్కుమార్, అశోక్కుమార్, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఈఓ ఎన్.గీత, ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, డీఈఓ దోర్భల భాస్కర్శర్మ పాల్గొన్నారు.
పరమపదోత్సవం..
వైకుంఠనాథుడిగా శ్రియఃపతి శ్రీమన్నారాయణుడు ఈ అధ్యయనోత్సవాల్లో తన దివ్యమైన అనుగ్రహన్ని భక్తకోటికి అందించడంలో విశేషమైనది. వైకుంఠమంటే ఈ ప్రకృతి కంటే పరమై ఏ విధమైన దోషాలు లేనిదై నిత్యానందం కలిగిస్తుంది. ప్రతిక్షణం వేదసూక్తాలతో స్తుతించబడుతూ పరమాత్మ అనుగ్రహాన్ని లోకానికి అందించే దివ్యమైన ధామమే వైకుంఠధామం. పరమపదనాథుడు నిత్య నివాస స్థానమైన వైకుంఠంలో పరమాత్మ అనంతునిపై శయనించి లక్ష్మీ విశిష్టుడై శ్రీవత్స కౌస్తుభ కిరీట అలంకారంతో అందమైన వనమాల మాణిక్యపు వజ్ర వైఢూర్యాలతో ప్రకాశిస్తుంటాడు. భక్తకోటిని నిరంతరం అనుగ్రహించే పరమాత్ముని ఈ ఉత్సవంలో వైకుంఠనాధుడిగా దర్శిస్తూ భగవన్నామ స్మరణ చేస్తూ భక్తకోటి తరించుట ఈ వేడుకలోని ప్రత్యేకత.
నేడు ఉత్సవాలు పరిసమాప్తి..
యాదగిరిగుట్ట అధ్యయనోత్సవాల్లో భాగంగా శనివారం లక్ష్మీనరసింహ స్వామి వారి అలంకార సేవలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం అధ్యయనోత్సవాలకు ఆలయ అర్చకులు పరిసమాప్తి పలుకనున్నారు.
స్వామిని దర్శించుకున్న ప్రముఖులు..
యాదాద్రీశుడిని ఎమ్మెల్సీ సురభివాణీదేవి, జార్ఖండ్ లెజిస్టేటివ్ అసెంబ్లీ ప్రెస్ అడ్వైజరీ కమిటీ సభ్యులు వినయ్కుమార్, నవీన్కుమార్, అశోక్కుమార్ వేర్వేరుగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి ఆలయ సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం చేయగా ఆలయాధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందించారు.