యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం నిత్య కైంకర్యాల అనంతరం అమ్మవారికి మార్గళి పూజల్లో భాగంగా 21వ పాశురాలను అర్చకులు, పారాయణందారులు పఠించారు. అనంతరం స్వామివారి అలంకార సేవలు ఆగమ శాస్త్రరీతిలో జరిగాయి. ఉదయం వెన్నముద్ద కృష్ణుడిగా యాదగిరీశుడు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి వేళ లక్ష్మీనరసింహ స్వామిని కాళీయ మర్ధనుడిగా అలంకరించి ఊరేగించారు. స్వామివారి సేవోత్సవంలో ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహా
చార్యులు, అర్చక బృందం దివ్య ప్రబంధ పఠనం కొనసాగించారు.
యాదగిరిగుట్ట, డిసెంబర్ 26 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం నిత్య కైంకర్యాల అనంతరం అమ్మవారికి మార్గళి పూజల్లో భాగంగా 21వ పాశురాలను అర్చకులు, పారాయణందారులు పఠించారు. అనంతరం స్వామివారి అలంకార సేవలు ఆగమశాస్త్రరీతిలో జరిగాయి. ఉదయం వెన్నముద్ద కృష్ణుడిగా యాదగిరీశుడు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని వెన్నముద్ద కృష్ణుడిగా అలంకరించి ప్రత్యేక సేవపై అధిష్ఠింపజేసి సేవోత్సవాన్ని నిర్వహించారు. సేవోత్సవంలో దివ్య ప్రబంధ పఠనం కొనసాగించారు. ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, అర్చక బృందం దివ్య ప్రబంధ పఠనం చేస్తుండగా అలంకార సేవలను ప్రధానాలయ మాఢవీధుల్లో ఊరేగించారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు అలంకార సేవలను కనులారా వీక్షించి తరించారు.
వెన్నముద్ద కృష్ణుడి విశిష్టత..
శ్రీకృష్ణుడి బాల్య లీలలో నవనీతచోరలీల ఎంతో ప్రశస్థమైంది. నవవిధతత్వాల సమాహారమే నవనీతం (వెన్న). పంచభూతాలు, ప్రకృతి, బుద్ధి, మనస్సు, అహంకారం ఇలా తొమ్మిదింటిని కలిగిన జీవుడిని ఉద్ధరించడమే ఈ నవనీత తతం. శ్రీకృష్ణుడు తనకు సమర్పించిన వెన్నను తానే వివిధ పద్ధతుల్లో దొంగిలించి దానిని అందరికీ పంచి ఆనందింపజేసిన రీతి అద్భుతమైనది. ఆళ్వారాదులు ఈ లీలలో స్వామివారిని దర్శించి వారి దివ్య ప్రబంధాలలో ఎంతో గొప్పగా స్తుతించారని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు.
రాత్రి కాళీయమర్ధనుడి అలంకారం
అధ్యయనోత్సవాల్లో భాగంగా రాత్రి వేళ లక్ష్మీనరసింహస్వామిని కాళీయమర్ధనుడిగా అలంకరించి ఊరేగించారు. ద్రావిడ ప్రబంధ సేవా కాలంలో పారాయణిక స్వాములతో సేవోత్సవం చేపట్టారు. ఈ వేడుకను అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. కాళీయమర్ధనుడి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామి అలంకార సేవకు హారతినిచ్చి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
కాళీయమర్ధన అలంకార సేవ విశిష్టత
శ్రీకృష్ణావతారంలో భగవానుడిని దర్శింపజేసిన లీలల్లో ఒకటి కాళీయమర్ధన లీల. యమునా నది వల్ల ఏర్పడిన ఒక మడుగులో కాళీయుడను ఒక విష సర్పం నివాసం ఏర్పాటు చేసుకుంది. ఆ కాళీయుని భయంకర విష ప్రభావంతో మడుగులో నివసిస్తున్న ప్రాణులు, తీర ప్రాంతంలోని జంతువులు, మడుగు మీదుగా ఎగిరే పక్షులన్నీ మరణిస్తున్నాయి. ప్రాణులను రక్షించేందుకు శ్రీకృష్ణుడు కదంబవృక్షంపై నుంచి కాళీయుని పడగలపైకి దూకి తాండవమాడాడు. శ్రీకృష్ణుడి పదఘాతంతో కాళీయుని పడగలు చితికిపోయాయి. అప్పుడా కాళీయుని భార్యలు శరణు కోరగా ఈ మడుగును వదిలి సముద్రంలోకి వెళ్లాలని ఆజ్ఞాపించాడు. భక్తవత్సలుడైన భగవానుడు ఎల్లవేళలా ప్రాణులను రక్షించునని ఈ సంఘటనతో తెలిసింది. కాళీయమర్ధన అలంకారంలో స్వామివారిని దర్శించుకుంటే సర్పదోష నివారణ కలుగునని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు వెల్లడించారు.
ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన
స్వామివారి సన్నిధిలో ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా సాగింది. ముఖ మండపంలో ఉత్సవమూర్తుల పాదాల వద్ద 108 బంగారు పుష్పాలు ఉంచి అష్టోత్తర నామాలు పఠిస్తూ అర్చించారు. అనంతరం స్వామివారికి హారతినిచ్చి భక్తుల గోత్రనామాలు పేరిట సంకల్పం చేశారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. సాయంత్రం వేళ స్వామివారికి దర్భార్ సేవ అత్యంత వైభవంగా చేపట్టారు. రాత్రి వేళ స్వామివారికి తిరువారాధన చేపట్టి, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన జరిపారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఆకుపూజ ఘనంగా జరిగింది. పాతగుట్టలో స్వామివారికి నిత్యారాధనలు వైభవంగా సాగాయి. వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. 25వేల భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామివారి ఖజానాకు రూ.54,64,760 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ రామకృష్ణారావు, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు
యాదగరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రాహుల్ కశ్యప్, రాష్ట్ర కమ్యూనికేషన్ డీఐజీ జక్కుల రామ్మోహన్, ఐఏఎస్ అధికారి హరీశ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. వారికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారి రాజన్బాబు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.