యాదగిరిగుట్ట, ఏప్రిల్ 9 : పంచనారసింహుడి క్షేత్రం ఆదివారం భక్తజనసంద్రంగా మారింది. ఎటుచూసినా భక్తులే కనిపించారు. వరుస సెలవుల నేపథ్యంలో స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మాఢ వీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలోని క్యూలైన్లు భక్తులతో సందడిగా మారాయి. కొండపైకి వాహనాల రద్దీ కొనసాగింది. స్వామి ధర్మ దర్శనానికి 5 గంటలు, వీఐపీ దర్శనానికి 4 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు నిర్వహించే సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. నిత్య తిరు కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వైభవంగా నిత్యారాధనలు
తెల్లవారుజామున స్వామికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. స్వామివారిని సుమారు 48 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.63,83,777 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామిని దర్శించుకున్న ప్రముఖులు
శ్రీవారిని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సెక్రటరీ మహాబీర్ సింగ్ కుటుంబసభ్యులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి దర్శించుకున్నారు. అర్చకులు వారికి ఆలయ సంప్రదాయరీతిలో స్వాగతం పలికి దర్శన అనంతరం వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి ప్రసాదం అందించారు. వీరితో పాటు పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగళి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు గన్నమనేని శ్రీనివాస్రావు, 100మంది పీఆర్టీయూ టీఎస్ కార్యవర్గ సభ్యులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.