– నల్లగొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు
– పెండింగ్, ప్రీ లిటిగేషన్ కేసులు 13,338 పరిష్కారం
రామగిరి, మార్చి 28 : కక్షిదారుల సత్వర న్యాయానికి లోక్ అదాలత్లు దోహదం చేస్తాయని నల్లగొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.నాగరాజు అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టులోని న్యాయ సేవాధికార సంస్థలో నిర్వహించిన జాతీయ లోక్అదాలత్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. లోక్ అదాలత్లో తీర్పు వస్తే తిరిగి అప్పీలుకు అవకాశం ఉండదన్నారు. నల్లగొండతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టులో వివిధ కోర్టులలో 16 బెంచీలలో సివిల్ కేసలు 20, క్రిమినల్ కేసులు 5,535, మోటర్ వాహన ప్రమాద బీమా కేసులు 156, ఇతర ప్రీ లిటిగేషన్ కేసులు 8,125, సైబర్ క్రైమ్ కేసలు 37 మొత్తం పెండింగ్, ప్రీ లిటిగేషన్ కేసులు 13,338 పరిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. అదే విధంగా ప్రమాద బీమా కేసుల్లో రూ.81,31, 0945 నష్ట పరిహారం బాదితులకు ఇప్పించినట్లు తెలిపారు. నల్లగొండలో నిర్వహించిన లోక్ అదాలల్లో ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి.పురుషోత్తంరావు, వివిధ కోర్టుల న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, కార్యదర్శి మంద నగేశ్, న్యాయవాదులు, కక్షిదారులు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.