యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : లెమన్ గ్రాస్ అంటే నిమ్మగడ్డి. వీటికి నిమ్మచెట్లతో ఎలాంటి సంబంధం లేదు. మంచి సువాసన గల ఈ మొక్కలతో అందం నుంచి ఆరోగ్యం దాకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని సూప్లు, కూరలు, టీలలో ఉపయోగిస్తుంటారు. ఇవి సన్నగా ఉండి.. ఏ ప్రాంతంలోనైనా మొలుస్తుంటాయి. ఇవి ఎక్కువగా భూటాన్ దేశంలో పండిస్తుంటారు. అయితే కరోనా తర్వాత వీటి వినియోగం విరివిగా పెరిగింది. ప్రజలు ప్రకృతిసిద్ధమైన వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే సమయంలో చైనా నుంచి వచ్చే ప్రొడక్ట్ను నమ్మడంలేదు. డిమాండ్ పెరుగడంతో ఇప్పుడు అధికంగా మన దగ్గరే తయారు చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి జూలై మధ్యలో లెమన్ గ్రాస్ పంట వేస్తారు. బలమైన పునాదిపై మందపాటి సమూహాల్లో పెరుగుతుంది. ఇది సుమారు 3 నుంచి 4అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. ఏడాదిలో రెండు నుంచి మూడు సార్లు కోతలు కోస్తారు. పంట వేసిన నాలుగు నెలల తర్వాత తొలి దిగుబడి అందుతుంది. పంటకు వచ్చిందా? లేదా చూడాలంటే.. కట్ చేసి వాసన చూడాలి. వాసన మంచిగా వస్తే పంట బాగా అందినట్లుగా భావిస్తారు. దీని రుచి చాలా ఘాటుగా ఉంటుంది.
ఏటా రూ.50వేల ఆదాయం..
లెమన్ గ్రాస్ పంటతో అధికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. వరితో పోలిస్తే నిమ్మగడ్డితో ఆదాయం బాగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సాగుకు ఖర్చు పెద్దగా ఉండదు. ఒక ఎకరంలో 5వేల మొక్కలు నాటనుండగా.. ఒక్కో మొక్కకు రెండు రూపాయలు అవుతుంది. ఒక్కసారి పెడితే ఆరేండ్ల వరకు పెట్టుబడి అవసరం లేదు. మొదటిసారి ఎకరానికి పెట్టుబడి రూ. 15వేలు అవుతుంది. ఆ తర్వాత మళ్లీ పెట్టుబడి పెద్దగా అవసరం ఉండదు. అన్ని ఖర్చులు పోను ఎకరాకు ఏటా రూ.50వేల దాకా ఆదాయం వస్తుంది. రెండో పంట నుంచి పెట్టుబడి లేకపోవడంతో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇక లెమన్ గ్రాస్ నుంచి తీసిన ఆయిల్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కాస్మొటిక్స్, సోప్స్, ఆయిల్స్, మెడిసిన్స్ తదితర వాటిల్లో వీటిని ఉపయోగిస్తుంటారు. అంతేకాకుండా పర్ఫ్యూమ్స్, రూమ్ ఫ్రెష్నర్స్, డియోడరెంట్ తదితర అనేక రకాలుగా వాడుతారు. నిమ్మగడ్డి నుంచి తీసే ఆయిల్ ధర మార్కెట్లో కిలోకు రూ.1500 వరకు ఉంటుంది. డిమాండ్ ప్రాతిపదికన రేట్లలో మార్పులు ఉండే అవకాశం ఉంది.
ఆరోగ్యం.. ఆందానికి ఎంతో మేలు
లెమన్ గ్రాస్తో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో సీ, డీ, ఈ విటమిన్లు పుష్కలంగా ఉండటంతో ట్యాబ్లెట్లను తయారు చేస్తారు. రోగ నిరోధక శక్తి పెంపొందించడంలో సహాయపడుతుంది. పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్న ఈ మొక్కకు నొప్పి, వాపు నుంచి ఉపశమనం కలిగిస్తుందని ప్రసిద్ధి. యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఆర్థరైటీస్ వంటి పరిస్థితుల్లో బాధపడుతున్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రశాంతత, విశ్రాంతి లక్షణాలకు పేరుగాంచింది. ఒత్తిడి, ఆందోళనకు గురైనప్పుడు లెమన్ గ్రాస్ టీ తాగితే ఒత్తిడి స్థాయి తగ్గుతుంది. దీని వాసన పీల్చడం వల్ల మనస్సుకు ప్రశాంతత అనిపిస్తుంది. నిమ్మ గడ్డి జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మగడ్డి బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాల శ్రేణికి వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, క్లీనింగ్ సొల్యూషన్స్, చర్మవ్యాధులతోపాటు అనేక వాటికి లెమన్ గ్రాస్ ఉపయోగపడుతుంది.
సాగు సులభం..
లెమన్ గ్రాస్ను ఎక్కడైనా పండించవచ్చు. పంట పొలాల్లోనే కాకుండా ఇంటి దగ్గర, గుట్టలు, ఫ్రీ ప్లేస్లో వేయవచ్చు. కరువు ప్రాంతాల్లో కూడా వీటిని నాటవచ్చు. ఒక్క మొక్క 20 మొక్కలుగా విస్తరిస్తుంది. పంటకు రసాయనాలు, ఎరువులు ఉపయోగించాల్సిన అవసరం లేదు. పశువులు, కోతుల బెడద ఉండదు. పంటను కీటకాలు, పురుగులు ఆశించవు. ఒక్కసారి నాటితే ఆరేండ్ల వరకు కొనసాగుతుంది. అంతేకాకుండా ఎరువులు, రసాయనాలు వాడకపోవడంతో భూమి సారం పెరుగుతుంది. పంట చేతికొచ్చాక.. దగ్గరలోనే మిషన్లు పెట్టి ఆయిల్ తీయొచ్చు.
ఆలేరులో పైలెట్ ప్రాజెక్ట్..
లెమన్ గ్రాస్కు మంచి డిమాండ్ ఉండటంతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వీటి సాగుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇందులో భాగంగా మొదటగా ఆలేరు మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు. 10వేల సీడ్కు ఆర్డర్ పెట్టారు. ఇప్పటికే 5వేల మొక్కలు అందాయి. మండలంలోని 14గ్రామాలకు సరఫరా చేశారు. గ్రామాల్లోని ఒక్కో నర్సరీలో 400 మొక్కలు నాటుతున్నారు. మరో 15ఎకరాల్లో మొక్కలు నాటనున్నారు. ఇక్కడ విజయవంతమైతే జిల్లాలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే యోచనలో అధికారులు ఉన్నారు.