మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం అంతంపేట గ్రామంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి శాఖ ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వాళ్లకు గులాబీ కండువాలు కప్పిన మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. దేశంలోనే టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రజాదరణ, పార్టీ సభ్యత్వం కలిగిన పార్టీ అన్నారు. ఈ పార్టీలో చేరడం పట్ల మనమంతా గర్వ పడాలని చెప్పారు. కేసీఆర్ అనుభవంతో కూడిన దిశా నిర్దేశం, యంగ్ అండ్ డైనమిక్ కేటీఆర్ లీడర్షిప్ ఉన్న పార్టీ ఇది అని చెప్పారు. భవిష్యత్తు లేని, ప్రజల అభిమానం లేని ప్రతిపక్ష పార్టీలతో ఏమి అవదన్నారు.
దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ పార్టీలకు రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడానికి యువత ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని, తగిన గుర్తింపు దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.
టీఆర్ఎస్లో చేరిన వారిలో అంతంపేటకు చెందిన డి.శ్రీకాంత్, జి.మహేష్, డి.రమేశ్, ఎస్.ప్రవీణ్, జి.సురేష్, ఎం.శ్యామ్ కుమార్, ఐ.ఇమాన్, ఎస్.వెంకటేష్, ఎస్.సురేష్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్.రమణ, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.