– సంస్కరణ సభలో జూలూరు గౌరీ శంకర్
కోదాడ, ఫిబ్రవరి 09 : స్నేహం, దాతృత్వం, ప్రేమ, విలువలతో ఎదిగిన చింతల వీరయ్య మరణం విచారకరమని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. విలువలతో ఎదిగిన వీరయ్యను కోదాడ గడ్డ మరిచిపోదన్నారు. సోమవారం స్థానిక గుడిగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో వేలాది మంది హాజరైన చింతల వీరయ్య సంస్కరణ సభలో ఆయన మాట్లాడారు. లక్ష్య సాధన కోసం కఠోర శ్రమ ఏ విధంగా చేయవచ్చునో వీరయ్య జీవితం నుంచి తెలుసుకోవచ్చు అన్నారు. అవకాశాలు, అండదండలు లేని స్థితి నుంచి స్వతంత్రంగా సమర్థతతో ఏ విధంగా ఎదగవచ్చునో వీరయ్య జీవితం ఓ ఊదాహరణ అన్నారు.

‘వీరయ్య నిను మరువదు కోదాడ గడ్డ’
ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు మాట్లాడుతూ.. ఒక సామాన్యుని అసమాన్య ప్రయాణం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలంటే వీరయ్య జీవితం నిదర్శనంగా నిలుస్తుందన్నారు. వీరయ్య మానవ సంబంధాల గూడు అని చెప్పారు. రామానంద తీర్థ గ్రామీణ విద్యాసంస్థ చైర్మన్ నారా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. మనిషి విశ్వాసం, వాస్తవిక సత్యాలను సృష్టిస్తుందన్నారు. ఎల్బీనగర్ సీఐ కృష్ణంరాజు మాట్లాడుతూ గుమస్తా నుండి రెండు రాష్ట్రాల ధాన్యం వ్యాపారిగా ఎదిగిన వీరయ్య వ్యక్తిత్వం నుండి కొత్త తరం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సభకు సీనియర్ జర్నలిస్ట్ గంధం బంగారు అధ్యక్షత వహించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వీరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సభలో కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్, కాన్వాస్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్వపల్లి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

‘వీరయ్య నిను మరువదు కోదాడ గడ్డ’