యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. ఆరో రోజు ఆదివారం ఉదయం యాదగిరీశుడు గోవర్ధనగిరిధారిగా భక్తులకు దర్శనమిచ్చాడు. కుడి చేతిలో పిల్లనగ్రోవి, ఎడమ చేతి చిటికెన వేలిపై గోవర్థన పర్వతాన్ని ఎత్తిన స్వామి వారిని పట్టు పీతాంబరాలతో ఆలంకరించి ప్రధానాలయ తిరువీధుల్లో ఊరేగించారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు నృసింహుడిగా అవతరించిన స్వామివారిని రాత్రి మృగరాజు సింహ వాహనంపై అధిష్టించి పట్టువస్ర్తాలు, ముత్యాలు, బంగారం ఆభరణాలతో అలంకరించారు. సన్నాయి మేళతాళాలు, జై నారసింహ నామస్మరణ మధ్య తిరుమాఢ వీధుల్లో ఊరేగగా భక్తులు కనులారా వీక్షించి తరించారు. సోమవారం ఉదయం జగన్మోహిని అవతారంలో లక్ష్మీనరసింహ స్వామి దర్శనమివ్వనున్నారు. రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవలో ఊరేగనున్నారు. అనంతరం ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించనున్నారు.
– యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 26
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభానంతరం తొలిసారి జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రోజుకో రూపంలో దర్శనమిస్తున్న యాదగిరీశుడు ఆదివారం గోవర్ధనగిరిధారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి మృగరాజు సింహ వాహనంపై యోగానంద నారసింహుడిగా ఊరేగారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఎదుర్కోలు మహోత్సవం సోమవారం జరుగనుండగా.. తిరుమాఢవీధుల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రి ఆలయ పరిసరాల్లో నిర్వహించే ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు, నృత్య ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
– యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 26
కృష్ణ భగవానుడి అద్భుత లీల గోవర్ధనగిరిధారి..
శ్రీకృష్ణ పరమాత్మ బాల్య లీలలో అపూర్వమైనది గోవర్ధనగిరిధారి లీల అని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు అన్నారు. నందవ్రజంలోని గోపకులు పంటలు కాపాడుకునేందుకు గోవర్ధన పర్వతం మీద వర్షాలు కురిపించమని ఇంద్రయాగాన్ని ఆచరిస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇంద్రయాగాన్ని నిలుపుదల చేసి గోవులను, బ్రాహ్మణులను, పర్వతాలను పూజించమని చెప్పగా.. గోపకులు ఆ వ్రతం ఆచరిస్తారు. దానికి కోపగించిన ఇంద్రుడు నందవ్రజంపై భీకరమైన రాళ్ల వర్షాన్ని కురిపిస్తాడు. దానికి గోపకులు భయపడి శ్రీకృష్ణున్ని ప్రార్థించగా శ్రీకృష్ణ పరమాత్మ వారికి అభయాన్నిచ్చి ఒక చేతితో గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి గొడుగులా ఏడు రోజులు ఎత్తిపట్టుకొని గోవులు, గోపకులను రక్షిస్తాడు.
శ్రీకృష్ణుడి మహత్యం తెలిసిన ఇంద్రుడు గర్వాన్ని వదిలి శరణాగతుడై గోవిందుడు అను బిరుదునిచ్చి నిష్క్రమిస్తాడు. స్వామివారు ‘అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ’ శరణు వేడితే తప్పక రక్షిస్తానని, ఇదే నా వ్రతమని గోవర్ధనగిరిధారి అలంకార సేవలో భక్తులకు దర్శనమిస్తున్నాడని ప్రధానార్చకుడు వివరించారు.
నేడు ఎదుర్కోలు మహోత్సవం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం లక్ష్మీనరసింహస్వామి జగన్మోహిని అవతారంలో దర్శనమివ్వనున్నారు. రాత్రి అశ్వవాహన సేవలో ఊరేగనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రధానాలయ తూర్పు మాఢవీధుల్లో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఆకట్టుకున్న ధార్మిక, సాహిత్య, సంగీత కార్యక్రమాలు
యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ప్రారంభమైన ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు భక్తులను ఆకట్టుకున్నాయి. యాదగిరిగుట్టకు చెందిన శ్రీవైష్ణవ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రభారభేరి, మల్లాపురం గ్రామానికి చెందిన శ్రీరామభక్త భజన మండలి ఆధ్వర్యంలో భజన, కార్వాన్కు చెందిన విశ్వాంజనేయ భక్త సమాజం వారి భజన, సభా ప్రారంభం, ఆస్థానం, మంగళ వాయిద్యం, ఆస్థానం ఆధ్వర్యంలో వైదిక ప్రార్థన, అమరవాది వెంకట నరసింహాచార్య స్వామి నృసింహ అవతార వైభవం గురించి అద్భుతంగా వివరించారు. శారదా భాగవతారిణి ఆధ్వర్యంలో భక్త ప్రహ్లాద హరికథ గానం భక్తులను మంత్ర ముగ్ధులను చేసింది.
సింహ వాహనంపై ఊరేగిన నారసింహుడు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు రాత్రివేళ దివ్య వాహన సేవలు అందుకోవడం ఆలయ సంప్రదాయం. దుష్ట శిక్షణ, శిష్ణ రక్షణకు నృసింహుడిగా అవతరించిన స్వామివారు ఆదివారం రాత్రి మృగరాజు సింహ వాహనంపై లక్ష్మీనరసింహస్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు. రుత్వికుల పారాయణాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రధానాలయ తిరుమాఢవీధుల్లో స్వామివారు ఊరేగారు. కార్యక్రమంలో వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ ఎన్.గీత, డిప్యూటీ ఈఓ దోర్బల భాస్కర్, ఏఈఓ గజవెల్లి రమేశ్బాబు పాల్గొన్నారు.
మానవ సంరక్షకుడిని
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు సింహవాహనారూఢుడై భక్తులకు దర్శన భాగ్యం కలిగించిన తీరు ఎంతో విశేషమైంది. సింహం కార్యదీక్ష, బుద్ధి కుశలత, పరాక్రమ ధైర్యం, గాంభీర్యాది గుణాలకు ప్రతీక అని ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. సింహ వాహనం శక్తికి, శీఘ్రగమనానికి నిదర్శనం. సింహం హింసకు ప్రతీక. స్వామివారు రాక్షస స్వభావాన్ని హింసించి (హిరణ్యకశ్యపుని వధించి) సత్యగుణం కలిగిన ప్రహ్లాదుడిని రక్షించాడు. సింహం అరణ్యానికి సంరక్షకుడు. మానవ జీవనం అనే సంసార అరణ్యానికి సంరక్షకుడిని తానేనని నరసింహరూపధారియైన స్వామివారు సింహ వాహనారూఢుడై భక్తులకు దర్శనమిస్తున్నాడని అర్చకులు వివరించారు.
వైటీడీఏ ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శనలు
వైటీడీఏ ఆధ్వర్యంలో డాక్టర్ ఆనందశంకర్ జయంత ఆధ్వర్యంలో భరతనాట్య ప్రదర్శన, మంగలభట్ బృందం ప్రదర్శించిన కథక్ నృత్యం, మల్లాది బ్రదర్స్ ఆధ్వర్యంలో కర్ణాటక గాత్ర కచేరీ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సాయంత్రం ముడుంబై మహతి బృందం ఆధ్వర్యంలో నృత్యం, ఉషా గోటేటి బృందం కూచిపూడి నృత్యం, పిల్లుట్ల కనకస్వామి బృందం ఆధ్వర్యంలో చేపట్టిన చిందు యక్షగానం నయనానందంగా సాగాయి.