యాదగిరిగుట్ట, మే 31: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్ష పుష్పార్చన పూజలు బుధవారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వివిధ రకాల పూలతో వేద పండితులు లక్ష పుష్పార్చన పూజలు రెండు గంటల పాటు చేశారు. స్వయంభూ ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్ర్తాలతో దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం ఘనంగా నిర్వహించారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. మొదటి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం జరిపించారు. గజవాహనంపై కల్యాణమూర్తులను అధిష్టింపజేసి సేవను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. సాయంత్రం వెండి మొక్కు జోడు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. రాత్రి శయనోత్సవం సేవను నిర్వహించి ఆలయానికి ద్వార బంధనం గావించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా జరిపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. స్వామివారిని సుమారు 18వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.24,74,736 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మొదటగా స్వామివారి సుదర్శన నారసింహ హోమంంలో పాల్గొన్న అనంతరం స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ పర్యవేక్షకులు రాజన్బాబు వారికి స్వామివారి ప్రసాదం అందించారు.