ప్రధానాలయంలో స్వామివారి జయంత్యుత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజు బుధవారం ఉదయం కాళీయ మర్ధనుడిగా, సాయంత్రం హనుమంత వాహనంపై శ్రీరాముడిగా లక్ష్మీనరసింహుడు తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
– యాదగిరిగుట్ట, మే 3
యాదగిరిగుట్ట, మే 3 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో లక్ష్మీనృసింహుడి జయంత్యుత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు బుధవారం స్వయంభూ ప్రధానాలయ ముఖ మండపంలో ఉదయం 9 గంటలకు నిత్యహవనం, మూలమంత్ర జపాలు పఠించారు. లక్ష్మీసూక్త, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణాలు నిర్వహించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం, నవకలశ స్నపనం జరిపించారు. ఉత్సవమూర్తులకు దివ్యమనోహరంగా అలంకరించి లక్ష కుంకుమార్చన నిర్వహించారు. కాళీయమర్ధన కృష్ణాలంకార సేవలో స్వామివారిని అలంకరించి ప్రధానాలయ మాడ వీధుల్లో ఊరేగించారు. సాయంత్రం 6 గంటలకు నృసింహ మూలమంత్ర హవనం జరిపించారు. అనంతరం హనుమంత వాహనంపై రామావతారం అలంకార సేవలో ఊరేగారు. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి జయంత్యుత్సవాలు శాస్త్రప్రకారం నిర్వహించారు. వేడుకల్లో ఆలయ అనువంశికధర్మకర్త నరసింహమూర్తి, ఈఓ ఎన్.గీత, ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనారసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, ఏఈఓలు గజ్వెల్ రఘు, రమేశ్బాబు, అర్చక బృందం పాల్గొన్నారు.
కాళీయ మర్ధన శ్రీకృష్ణాలంకార సేవలో
భక్తుల రక్షణార్థమై అవతరించిన అవతారాల్లో విశిష్టమైనది కృష్ణావతారం. ఈ అవతారంలో బాలకృష్ణుడి లీలల్లో అపూర్వమైన కాళీయ మర్ధనలీలలో నారసింహుడు భక్తులకు దర్శనిమిచ్చారు. యమునా నదితీరంలో ఒక మడుగున చేరిన కాళీయుడు తన సమీపంలోని పశుపక్ష్యాదులను, ప్రకృతిని హింసిస్తుండగా శ్రీకృష్ణ పరమాత్మ కాళీయుని విషపు కోరలను చిదిమి, గర్వాన్ని అణిచి నదీ జలాలు కలుషితం కాకుండా రక్షించి, గోవులు, గోపాలకులను సంరక్షించిన తీరు కాళీయ మర్ధన లీలలో పేర్కొనబడిందని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనారసింహాచార్యులు వివరించారు.
హనుమంత వాహనంపై…
స్వామివారి ప్రధానాలయంలో సాయంత్రం 6 గంటలకు నిత్య హవనాలు, సామూహిక పారాయణాలు, నృసింహ మూలమంత్ర హవనం నిర్వహించారు. అనంతరం హనుమంత వాహనంపై శ్రీరామ అలంకార సేవలో నారసింహుడు భక్తులకు దర్శనమిచ్చాడు. దుష్టశిక్షణ, శిష్ట రక్షణకై ధర్మాన్ని పునఃప్రతిష్టించేందుకు ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని అన్న ఆదర్శాలను నిలుపుకునేందుకు త్రేతాయుగంలో ఆదర్శమూర్తిగా అవతరించిన అవతారమైన శ్రీరాముడి అవతారంలో యాదగిరీశుడు తిరుమాఢవీధుల్లో ఊరేగారు. రాముడనగా తారతమ్య భేదం లేకుండా అందరినీ ఆనందింపజేసేవాడు. అహంకార రహితుడు, సత్యవాది, పరాక్రమవంతుడు, ఎదుటివారి దుఃఖాన్ని తన దుఃఖంగా భావించి వారి వేదనను తొలగించి సంరక్షించడం రామచంద్రునిలోని కల్యాణగుణ తత్పరతను తెలియజేస్తున్నదని ఆలయ ప్రధానార్చకుడు తెలిపారు. వినయం, విజ్ఞత, ప్రభుభక్తి, మంత్రిత్వం వంటి గుణాలు కలిగిన స్వామి భక్తి పరామణుడు హనుమంతుడుని అన్నారు. అలాంటి హనుమంత వాహనంపై రామచంద్రుడు ఊరేగి భక్తులకు దర్శనమిచ్చాడు.
స్వయంభువులకు నిత్యారాధనలు
లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలు అత్యంత వైభవంగా సాగాయి. బుధవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వయంభూ నారసింహస్వామిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. నిజాభిషేకం జరిపారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం తిరువీధి, దర్బార్ సేవలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 10 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ఖజానాకు రూ.16,62,775 ఆదాయం సమకూరినట్లు ఈఓ గీత తెలిపారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ధార్మిక సాహిత్య సంగీత మహాసభలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. గుండ్లపల్లికి చెందిన వీరప్రతా మారుతి భజన మండలి, యాదగిరిగుట్టకు చెందిన భాగ్యలక్ష్మి భజన మండలి ఆధ్వర్యంలో భజనలు, ముంబాయికి చెందిన మధుర ధ్వని బృందం ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.
నేటితో ఉత్సవాలు పరిపూర్ణం
స్వామివారి ప్రధానాలయం, పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం 7 గంటలకు మూలమస్త్ర హవనం, 9 నుంచి 9:30 గంటల వరకు మహాపూర్ణాహుతి అనంతరం సహస్ర కలాశాభిషేకం, సాయంత్రం 7 గంటలకు నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావం, మహానివేదన, తీర్థప్రసాద గోష్టి నిర్వహించి ఉత్సవాలను పరిపూర్ణం చేయనున్నారు.