యాదాద్రి, అక్టోబర్ 6: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో గురువారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష పుష్పార్చన శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు సహస్రనామ పఠనాలతో అర్చకబృందం, వేద పండితులు వివిధ రకాల పూజలు జరిపారు. స్వయంభూ ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్ర్తాలతో దివ్యమనోహరంగా అలంకరించి సుమారు 2 గంటల పాటు లక్ష పుష్పార్చన కొనసాగించారు. స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్లను ముస్తాబు చేసి గజవాహనంపై ఊరేగించారు. అనంతరం లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపారు.
స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి వెండి మొక్కు జోడు సేవ, దర్భార్ సేవ అత్యంత వైభవంగా చేపట్టారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. 9,640 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.21,57,687 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.