యాదగిరిగుట్ట, డిసెంబర్16: వాసాలమర్రి గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి పలుగుల ఉమారాణిని గ్రామ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. వాసాలమర్రి పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి పడిన ఓటును అధికార కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే అధికారులు ఓట్ చోరీకి పాల్పడ్డారని మండిపడ్డారు. కాం గ్రెస్ ఓట్ చోరీకి పాల్పడిందని కేటీఆర్ ఆరోపించారు. ఇది ముమ్మాటికి అక్రమమని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని తేల్చి చెప్పారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ను మంగళవారం మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, వాసాలమర్రి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి పలుగుల ఉమారాణి కలిసి ఎన్నికల్లో జరిగిన అన్యాయాన్ని కేటీఆర్కు వివరించారు. తొలిదశ ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులకు సమాన ఓట్లు రాగా డ్రా పద్ధతిలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు అధికారులు ప్రకటించారని అన్నారు.
ఆ మరుసటి రోజే కౌంటింగ్ జరిగిన రూమ్ వద్ద ఏ 038321 అనే నంబర్ గల బ్యాలట్ పేపర్ స్థానికులకు కనిపించిందన్నారు. పేపర్ వెనుక భాగంలో పోలింగ్ అధికారి సంతకంతో పాటు 16/2 రౌండ్ సీల్ కూడా ఉందన్నారు. దానిపై బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి పలుగుల ఉమారాణికి కేటాయించిన కత్తెర గుర్తుపై ఓటేసిన ముద్ర స్పష్టంగా ఉందన్నారు. ఉద్దేశ పూర్వకంగానే ఉమారాణిని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులతో కుమ్మక్కయి కుట్ర చేశారని, మాజీ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వాసాలమర్రిలో అధికార కాంగ్రెస్ ఓట్ చోరీకి పాల్పడిందని విమర్శించారు. దీనిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రజలు స్పష్టంగా ఇచ్చిన తీర్పును పక్కనపెట్టి, అన్యాయంగా ఫలితాన్ని మార్చే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. వాసాలమర్రి ప్రజలకు న్యాయం జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటం బీఆర్ఎస్ ధ్యేయమని పేర్కొంటూ, జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వాసాలమర్రిలో ఓట్ చోరీకి పాల్పడిన కాంగ్రెస్ ఉదంతాన్ని బీఆర్ఎస్ లీగల్ సెల్కు మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి వివరించారు. న్యాయపరమైన అంశాలను చర్చించారు.అభ్యర్థి ఉమారాణికి న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని కోరారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను లీగల్ సెల్కు అందజేశారు.