గతేడాదితో పోలిస్తే కృష్ణానదిలో వరద ప్రవాహం ఈ సారి ఆలస్యమైంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం మొదలు కావడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కృష్ణానదిపై ఎగువ నుంచి తొలి ప్రాజెక్టుగా ఉన్న ఆల్మట్టికి స్థిరంగా వరద కొనసాగుతున్నది. నారాయణపూర్, జూరాలకు పెద్దగా వరద లేకపోయినా తుంగభద్రలోనూ భారీ వరద మొదలైంది. ఇవన్నీ నిండితేనే దిగువన ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీరు విడుదల కానుంది. ఈ క్రమంలో నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగం కృష్ణమ్మ పరుగుల కోసం ఎదురు చూస్తున్నది. గతేడాది ఇదే నెల చివరి వారంలో ఆయకట్టుకు సాగునీటిని విడుదల కాగా, ఈ సీజన్లో అలాంటి పరిస్థితులు కనిపించకపోవడం కొంత ఆందోళనకు గురిచేస్తున్నది.
నల్లగొండ ప్రతినిధి, జూలై25(నమస్తే తెలంగాణ): ఓ వైపు గోదావరి నది ఉగ్రరూపం దాల్చి ప్రాజెక్టులు పొంగిపొర్లుతుంటే కృష్ణానదికి మాత్రం ఇప్పుడిప్పుడే జలకళ మొదలవుతున్నది. కృష్ణానది జన్మస్థానం మహాబలేశ్వరంతో పాటు పశ్చిమ కనుమల్లో ఈ సారి వర్షాలు ఆలస్యమయ్యాయి. గత పది రోజుల నుంచే భారీ వర్షాలు పడుతుండడంతో కృష్ణమ్మ ప్రాజెక్టుల వైపు కదులుతున్నది. దాంతో కృష్ణానదిపై కీలక ప్రాజెక్టుల్లో ఒకటైన ఆల్మట్టికి వారం రోజులుగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఆల్మట్టికి మంగళవారం ఉదయం 1.16 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. మూడు రోజుల్లో ఆల్మట్టి ప్రాజెక్టులో 16 అడుగుల నీటిమట్టం పెరుగడంతో పాటు 36 టీఎంసీల నీరు వచ్చి చేరింది.
ఈ ప్రాజెక్ట్కు మరో 12 అడుగుల మేర (55 టీఎంసీల) నీరు వస్తే పూర్తిగా నిండుతుంది. అనంతరం గేట్లు ఎత్తి దిగువన ఉన్న నారాయణపూర్ డ్యాంకు నీటిని విడుదల చేయనున్నారు. నారాయణపూర్కు ప్రస్తుతం 13వేల క్యూసెక్కుల వరద వస్తుండగా మరో 15 అడగుల మేర నీటిమట్టం పెరిగితే నిండనుంది. ఇక రాష్ట్ర పరిధిలో ఉన్న జూరాల ప్రాజెక్ట్ దాదాపు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో ఉంది. ఎగువ నుంచి ఏ మాత్రం వరద వచ్చినా ఆ నీరంతా జూరాల మీదుగా శ్రీశైలం ప్రాజెక్ట్లోకి రానున్నది. ఇది కాకుండా తుంగభద్ర ప్రాజెక్ట్కు కూడా స్థిరంగా వరద కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 72 వేల క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో బుధవారానికి లక్ష దాటుతుందని అంచనా వేస్తున్నారు. మూడు రోజుల్లోనే తుంగభద్రలో 13 అడుగుల మేర నీరు(18 టీఎంసీలు) చేరింది. ఇది పూర్తి స్థాయిలో నిండాలంటే మరో 27 అడుగుల (74టీఎంసీలు) నీరు వచ్చి చేరాలి.
గతేడాది ఈ పాటికే నిండిన శ్రీశైలం
గతేడాది ఎగువ ప్రాంతాల్లో జూలై రెండో వారంలోనే భారీ వర్షాలు కురువడంతో పైనున్న ప్రాజెక్టులన్నీ నిండాయి. దాంతో శ్రీశైలం ప్రాజెక్ట్కు కూడా జలకళ సంతరించుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా సరిగ్గా గతేడాది ఇదే సమయానికి 881.70 అడుగుల నీటిమట్టం నమోదైంది. దాంతో నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేశారు. కానీ ఈ ఏడాది శ్రీశైలంకు ఇంకా ఇన్ఫ్లో మొదలుకాలేదు. ప్రస్తుతం శ్రీశైలంలో 814 అడుగల మేర (37 టీఎంసీలు) నీరు మాత్రమే నిల్వ ఉంది. శ్రీశైలం నిండాలంటే మరో 68 అడుగుల మేర (179 టీఎంసీల) నీరు వచ్చి చేరాల్సి ఉంది. మంగళవారం ఉదయానికి శ్రీశైలం ప్రాజెక్టుకు 27,979 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ఈ ప్రాజెక్ట్కు వరద పెరిగితే అక్కడి నుంచి ముందుగా పవర్ జనరేషన్ ద్వారా నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేసే అవకాశాలు ఉంటాయి.
సాగర్లో 516 అడుగులు
ఉమ్మడి జిల్లా పరిధిలో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్లో ప్రస్తుతం పూర్తి నిరాశజనక వాతావరణ నెలకొంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం కేవలం 516.10 అడుగుల నీటిమట్టం మాత్రమే ఉంది. పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 142.44 టీఎంసీ నీరు ఉంది. ఈ పరిస్థితుల్లో ఆయకట్టుకు నీటి విడదలపై సందేహాలు నెలకొన్నాయి. గతేడాది ఇదే సమయానికి సాగర్లో 544.50 అడుగుల (198 టీఎంసీలు) నీటిమట్టం ఉంది. దాంతో గతేడాది సాగర్ ఆయకట్టుకు పదేండ్లలో తొలిసారిగా జూలైలోనే సాగునీటిని విడుదల చేయగలిగారు. కానీ ప్రస్తుతానికి ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఎగువ నుంచి వచ్చే వరద మరింతగా పెరిగితే వచ్చే నెల మూడో వారం నాటికి సాగునీటి విడుదలకు అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.