కోదాడ, జనవరి 8 : విద్యారంగంలో మరుపురాని మాస్టారు కొండపల్లి రామానుజరావు అని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. కోదాడ పట్టణంలోని మేళ్లచెర్వు కాశీనాథం ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన స్వర్గీయ కొండపల్లి రామానుజరావు సంస్మరణ సభలో పాల్గొని మాట్లాడారు. విద్యారంగంలో అస్తమించని సూర్యుడు రామానుజరావు అని కొనియాడారు. విద్యార్థి ఉద్యమాలకు పురుడు పోసిన కేఆర్ఆర్ కళాశాలలో నాలుగు దశాబ్దాలకు పైగా బోధన చేసిన ఆదర్శ గురువు అని పేర్కొన్నారు. వైస్ ప్రిన్సిపాల్, ఇన్చార్జి ప్రిన్సిపాల్గా పనిచేసి కళాశాల అభివృద్ధికి కృషి చేశారన్నారు.
రామానుజరావు స్మృతితో సమాజాభివృద్ధికి ట్రస్టులు ఆవిర్భావించాలన్నారు. కృష్ణపట్టె ప్రాంతంలోని పారిశ్రామికవేత్తలు విద్యాదాతలుగా మారాలని సూచించారు. ప్రముఖ వైద్యుడు జాస్తి సుబ్బారావు మాట్లాడుతూ రామానుజరావు హాస్యం పండించడంలో సవ్యసాచి అని, బాధలో సైతం హాస్యాన్ని పండించిన గొప్ప మేధావి అని పేర్కొన్నారు. ఆయన సహచరులు శ్రీరామ కవ చం వెంకటేశ్వర్లు, విశ్రాంత ప్రిన్సిపాల్ అందె సత్యం ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేఆర్ఆర్ జూనియర్ కళాశాల తెలుగు అధ్యాపకుడు వేముల వెంకటేశ్వర్లు రూపొందించిన ‘మరుపురాని మాసారు’ స్మృతి సంచికను విడుదల చేశారు. కొండపల్లి వెంకటశేష ప్రసాద్, కుటుంబసభ్యులు శారదాప్రసాద్, శివరాంప్రసాద్, శ్రీవాత్సవ్ప్రసాద్, కళాశాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.