నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్15(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. నల్లగొండకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, హుజూర్నగర్కు నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, కోదాడకు పద్మావతి, నకిరేకల్కు వేముల వీరేశం, నాగార్జునసాగర్కు కుందూరు.
(మొదటి పేజీ తరువాయి) జయవీర్రెడ్డి, ఆలేరుకు బీర్ల ఐలయ్యలను ఖరారు చేస్తూ తొలి జాబితా విడుదల చేసింది. మిగతా ఆరు స్థానాల్లో అభ్యర్థులపై ఇంకా సయోధ్య కుదరనట్లు తెలిసింది. సూర్యాపేటలో రాంరెడ్డి దామోదర్రెడ్డి, పటేల్ రమేశ్రెడ్డి మధ్య టికెట్ కోసం గట్టి పోటీ నెలకొంది. తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ కాదంటే ఎవరేనేది స్పష్టత లేదు. భువనగిరిలో కుంభం అనిల్కుమార్రెడ్డికి దాదాపు ఖరారే అని చర్చ నడుస్తున్నా… స్థానికంగా ఉన్న బీసీ నేత రామంజనేయగౌడ్ బీసీ కోటాలో పట్టుబడుతున్నారు.
మునుగోడును పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయిస్తారని ఆది నుంచి చర్చ ఉన్నా..తాజాగా లేదని తెలుస్తున్నది. దాంతో అక్కడ చెలమళ్ల కృష్ణారెడ్డికి టికెట్ రావచ్చని భావన. మిర్యాలగూడ టికెట్ను పొత్తులో భాగంగా సీపీఎంకి కేటాయిస్తారన్న చర్చ ఉంది. ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే బాలూనాయక్, వడ్త్యా రమేశ్నాయక్, కిషన్నాయక్ల మధ్య టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు సమాచారం.
అయితే ఇప్పటికే ప్రకటించిన నకిరేకల్లో ఇన్నాళ్లు టికెట్టు ఆశించిన దైద రవీందర్, వేదాసు శ్రీధర్, కొండేటి మల్లయ్య లాంటి వాళ్లు ఏ మాత్రం సహకారం అందిస్తారనేది చూడాల్సిందే. ఇక ఆలేరులో బోరెడ్డి అయోధ్యరెడ్డి, కట్కూరి రాంచంద్రారెడ్డి లాంటి నేతలు కూడా బీర్ల ఐలయ్య అభ్యర్థిత్వానికి ఏ మేరకు సపోర్టు చేస్తారనేది సందేహాస్పదంగానే ఉంది. నల్లగొండలోనూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి బీసీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేక కనిపిస్తున్నది.