నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు17(నమస్తే తెలంగాణ)/మునుగోడు : వ్యాపారాల కోసం రాజకీయాలు చేయడం కోమటిరెడ్డి సోదరులకు పరిపాటని, ఇప్పుడు కూడా కాంట్రాక్టు కోసమే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ పంచన చేరాడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. రాజీనామాలతో అభివృద్ధి జరుగదని, ఉప ఎన్నికలే వస్తాయని ఎద్దేవా చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పడం బూటకమని, అలాంటప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ నుంచే తిరిగి ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా మునుగోడులో ఈ నెల 20న నిర్వహించనున్న ప్రజా దీవెన సభ ఏర్పాట్లను పరిశీలించారు.
ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, క్రీడాభివృద్ధి సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డితో కలిసి మంత్రి సభ ఏర్పాట్లను సమీక్షించారు. వేదిక, సీఎం వచ్చే రూట్, వీఐపీల గ్యాలరీలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మీడియాతో మాట్లాడారు. మునుగోడు ప్రజల విశ్వాసాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అమిత్షా, మోదీల వద్ద తాకట్టు పెట్టారన్నారు. కేవలం తన వ్యాపార ప్రయోజనాల కోసమే మునుగోడు ప్రజలకు ద్రోహం చేస్తున్నాడని, ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సభకు హాజరయ్యే నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేస్తున్నామని వాహనాల పార్కింగ్కు 10చోట్ల స్థలాలను కేటాయించామని తెలిపారు. మంత్రి వెంట కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, డీఎస్పీ నర్సింహారెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామి, రాష్ట్ర నాయకులు నారబోయిన రవి, బొల్ల శివశంకర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, వైస్ ఎంపీపీ అనంత వీణ, శరత్, కుమారస్వామి ఉన్నారు.
ఎమ్మెల్యే శానంపూడిసైదిరెడ్డి
చౌటుప్పల్ రూరల్ : టీఆర్ఎస్లో చేరిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని అంకిరెడ్డిగూడెంలో నిర్వహించిన గ్రామ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్, సీపీఎంలకు చెందిన సుమారు 50మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ నెల 20న మునుగోడులో నిర్వహించే ప్రజాదీవెన సభను విజయవంతం చేయాలని కోరారు. మాజీ సర్పంచ్ సుర్వి మల్లేశ్ గౌడ్, నాయకులు ముప్పిడి శ్రీనివాస్గౌడ్, ఢిల్లీ మాధవరెడ్డి, చిన్నం బాలరాజు, పర్నె శ్రీధర్రెడ్డి, బీమగోని మల్లేశ్గౌడ్, స్వామిగౌడ్, విజయ్కుమార్ పాల్గొన్నారు.