ఈ వైకుంఠధామం కోదాడ మండలం బాలాజీనగర్లోనిది. మనిషి చివరి మజిలీకి చింత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు వెచ్చించి నిర్మించింది. చుట్టూ గ్రీనరీ, దహన వాటికలు, ఆధ్యాత్మిక వాతావరణం, అధునాతన సౌలత్లతో ఈ వైకుంఠధామం ఇతర ప్రాంతాలకు మోడల్గా నిలుస్తున్నది.
కోదాడ రూరల్, డిసెంబర్ 30 : చుట్టూ పచ్చని పంట పొలాల నడుమ ఆధునిక దహన వాటికలు, వచ్చిన వారు కూర్చునేందుకు కుషన్ చైర్లు, ఆధునిక హంగులతో బాత్రూంలు, మధ్యలో పచ్చని మొక్కలతో పార్కును తలపిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో కోదాడ పట్టణంలో వైకుంఠధామాలు నిర్మించబడ్డాయి. పట్టణంలో రూ.2కోట్లతో రెండు వైకుంఠధామాలు నిర్మించగా ఒకటి ప్రారంభంగా కాగా మరోటి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన వైకుంఠధామాన్ని చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ అధికారులు తరలివస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పట్టణ జనాభా లెక్కల ప్రకారం 50వేలు కలిగిన మున్సిపాలిటీకి ఒక వైకుంఠధామం, 50వేల నుంచి లక్ష జనాభా కలిగిన మున్సిపాలటీలకు రెండు వైకుంఠధామాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా లక్ష జనాభా గల కోదాడ పట్టణానికి రెండు వైకుంఠధామాలు మంజూరు కాగా పట్టణ పరిధి బాలాజీనగర్లోని సర్వే నెంబర్ 849లో ఎకరం, తమ్మరబండపాలెంలో 484 సర్వే నెంబర్లో ఎకరంలో రూ.2కోట్లతో వైకుంఠధామాలు సర్వంగ సుందరంగా నిర్మించారు. బాలాజీనగర్ వైకుధామాన్ని ఎమ్మెల్యే బొల్లం మల్యయ్య ప్రారంభించగా, తమ్మరలో ప్రారంభించాల్సి ఉంది. అదేవిధంగా తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ మంజూరు చేసిన కోటి రూపాయల నిధులతో పట్టణంలోని అనంతగిరి రోడ్డు, శ్రీరంగాపురం, లక్ష్మిపురం కాలనీలోని పాత శ్మశానవాటికల ఆధునీకరణకు పనులు ప్రారంభించారు.
రాష్రానికే తలమానికంగా వైకుంఠధామాలు
కోదాడ పట్టణంలోని వైకు ంఠధామాలు సర్వంగ సుందరంగా నిర్మితమై పలు మున్సిపాలటీలకు ఆదర్శంగా నిలిచాయి. చుట్టూ పచ్చని పైర్లు నడుమ పార్కులాగా పచ్చని గడ్డితో, సుందరంగా జంతువుల విగ్రహాలు ప్రశాంత శివుని విగ్రహంతో వాతావరణం ప్రశాంతత సంతరించుకుంది. వీటితో పాటుగా పాత వాటిని ఆధునీకరించి అన్ని సదుపాయాలు కలిగిస్తాం. రాష్ర్టానికే ఇవి ఆదర్శంగా నిలుస్తున్నాయి.
– ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్