ఫ్లోరైడ్.. వేల మంది జీవితాల్లో విషం చిమ్మింది. వంకర్లు తిరిగిన శరీర ఆకృతి.. నడవలేని నిశ్చలస్థితి.. తమ పనులు తాము చేసుకోలేని దుస్థితి.. గత పాలకుల పాపానికి ఎన్నో కుటుంబాల్లో అంధకారం అలుముకున్నది. ఎంతో మంది మంచానికే పరిమితమై జీవచ్ఛవంలా కాలం వెళ్లదీస్తున్న ఘటనలు సీఎం కేసీఆర్ను కదిలించాయి. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న వారికి ఆయన దారి దీపమయ్యారు. దశాబ్దాలుగా ప్రజలను పట్టిపీడిస్తున్న ఫ్లోరెడ్ రక్కసిపై యుద్ధం ప్రకటించారు. దాని అంతానికి అహోరాత్రులు శ్రమించి మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టారు. ఈ మహత్తర క్రతువును మునుగోడు నుంచే ప్రారంభించి ఫ్లోరైడ్ సమస్యకు చరమగీతం పాడారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మూడేండ్లలోనే నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఉన్న 329 గ్రామాలకు రూ.848.66కోటత్లో 1919.3కి.మీ. పైప్లైన్ వేసి, 562 ట్యాంకులు నిర్మించి ఇంటింటికీ శుద్ధి చేసిన కృష్ణా నీటిని అందిస్తున్నది. శుద్ధి చేసిన కృష్ణా జలాలను అందించారు. దాంతో ఫ్లోరోసిస్ మహమ్మారి తగ్గుముఖం పడుతూ వచ్చింది. ఇటీవల ఆరోగ్య శాఖ చేసిన పరీక్షల్లో ప్రతి ఒక్కరికీ సాధారణ ఫ్లోరోసిస్ శాతమే ఉన్నట్లు నివేదిక ఇచ్చింది.
నల్లగొండ, అక్టోబర్ 23 : ఫ్లోరోసిస్కు కేరాఫ్ అయిన మునుగోడుకు మిషన్ భగీరథతో ఇంటింటికీ శుద్ధ జలాలు సరఫరా చేయడంతో ఆ మహమ్మారి ఆనవాళ్లు నామరూపాల్లేకుండా పోయాయి. ఏడున్నర దశాబ్దాల క్రితమే ఈ మహమ్మారిని గుర్తించినప్పటికీ ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో క్రమంగా అది పెరిగి.. కాళ్లు, చేతులు వంకరపోయి ఎంతో మందిని జీవచ్ఛవాలుగా మార్చింది. 2003లో ఫ్లోరోసిస్ పోరుబాట పేరుతో మునుగోడులో పర్యటించిన కేసీఆర్ ఇంటింటికీ కృష్ణా నీరు ఇచ్చి ఫ్లోరోసిస్ను తరిమికొడుతానని హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన మూడేండ్లలోనే మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఉన్న 329 గ్రామాల్లో మనిషికి రోజుకు వంద లీటర్ల చొప్పున మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ఫలితంగా అక్కడి ప్రజలు ఫ్లోరోసిస్ నుంచి విముక్తి పొందారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్లో మిషన్ భగీరథకు శంకుస్థాపన చేసిన సీఎం, అక్కడి ప్రజలకే తొలుతగా తాగునీరు అందించాలని సంకల్పించారు. ఏకేబీఆర్ నుంచి 938.38 కి.మీ. పైప్లైన్ వేసి, రూ.725.59కోట్లు బల్క్ నీటి కోసం ఖర్చు చేశారు. రూ.123.03 కోట్లు పెట్టి ఆయా గ్రామాల్లో 991 కి.మీ. అంతర్గత పైప్లైన్ వేసి, 78,601 ఇండ్లల్లో నల్లాలు బిగించి నీరు సరఫరా చేస్తున్నారు.
మిషన్ భగీరథ నీళ్లు తొలుత అందింది మునుగోడుకే..
ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధ జలాలు అందించాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ పథకాన్ని ప్రకటించి, మొదలు పెట్టింది. మునుగోడులో ఫ్లోరోసిస్ తీవ్రత అధికంగా ఉండేది. దీంతో ఆలస్యం చేయకుండా ఇంటింటికీ నల్లా బిగించి, శుద్ధి చేసిన నీటిని అందించాలని సీఎం ఆదేశించడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. 2018లోనే ప్రతి గ్రామానికీ బల్క్ వాటర్ సరఫరా అయినప్పటికీ అప్పట్లోనే మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ నీరివ్వగా, మిగిలిన ప్రాంతాలకు 2019-20లో ఇచ్చారు. అయితే నల్లగొండకు నాగార్జునసాగర్ నుంచి తాగునీరిచ్చిన సర్కారు, మునుగోడుకు ఏకేబీఆర్ ద్వారా సరఫరా చేస్తున్నది.
ముచ్చర్ల, పానగల్, లింగోటం నుంచి శుద్ధజలాలు
మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాలు 161 గ్రామ పంచాయతీలకు 2017 నుంచి శుద్ధి చేసిన కృష్ణా జలాలు ఇంటింటికీ అందుతున్నాయి. నాంపల్లి మండలం బాట్లపల్లి (లింగోటం), ముచ్చర్లలో ఉన్న 70ఎంఎల్డీ ట్రీట్మెంట్ వాటర్ ప్లాంట్ నుంచి చండూరు, నాంపల్లి, మర్రిగూడ, సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్కు నీటి సరఫరా జరుగుతుండగా, పానగల్లోని 59ఎంఎల్డీ నుంచి మునుగోడుకు సరఫరా అవుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలు ఆవాసాలతో కలిపి మొత్తంగా 329 గ్రామాలకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం నీటిని సరఫరా చేస్తున్నారు. ఆయా ప్లాంట్లలో ఆలంతో చెత్తాచెదారం, మట్టిని తొలగించి క్లోరిన్తో నీటిని శుద్ధి అందిస్తున్నారు. ప్లాంటులో క్లోరినేషన్ అయిన నీరు 20 నుంచి 25 కి.మీ. వరకు క్లోరినేషన్తో ఉండగా, ఆయా గ్రామాల్లో మరోసారి ట్యాంకుల వద్ద క్లోరినేషన్ చేస్తున్నారు. నెలకు రెండుసార్లు ట్యాంకులు శుభ్రం చేసి శుద్ధ జలాలు అందజేస్తుండడంతో ఫ్లోరిన్ తీవ్రతకు అడ్డుకట్ట పడింది.
ఏకేబీఆర్ నుంచి ప్రతి గ్రామానికీ పైప్లైన్..
మునుగోడు నియోజకవర్గానికి శుద్ధ జలాలు ఇవ్వడానికి ప్రభుత్వం కృష్ణా జలాల కేటాయింపుతో డిజైన్ చేసింది. సాగర్ నుంచి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా నాంపల్లి మండలంలోని లింగోటం, నల్లగొండలోని పానగల్ వరకు బల్క్ వాటర్ ఇవ్వడానికి 928.30 కి.మీ.మేర భగీరథ పైప్లైన్ వేసింది. ఇందుకు ప్రభుత్వం రూ.725.59 కోట్లు ఖర్చు చేసింది. ఆయా గ్రామాల్లో ఎనిమిది సంపులు నిర్మించి, 14 ఎలివేటెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు (ఈఎల్బీఆర్ఎస్), 28 ఓవర్హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు (ఓహెచ్బీఆర్ఎస్), 90 ఓవర్హెడ్ సర్వీస్ రిజర్వాయర్లు (ఓహెచ్ఆర్ఎస్) నిర్మించింది. ఇక గ్రామాల్లో 991 కి.మీ. అంతర్గత పైప్లైన్ వేసి, ఆయా మండలాల్లో 78,601 ఇండ్లకు నల్లా కనెక్షన్ల కోసం మరో రూ.123.07 కోట్లు ఖర్చు చేసింది. మొత్తంగా మునుగోడు నియోజకవర్గంలో రూ.848.66 కోట్లు వెచ్చించింది. ప్రతి రోజూ ఒక్కొక్కరికి వంద లీటర్ల చొప్పున నీళ్లను సరఫరా చేస్తున్నది. ప్రతి గ్రామంలో ఇంట్రాపనులు సైతం పూర్తి చేసి, సంపూర్ణంగా నీటి విడుదల చేస్తున్నది.
ప్రజల్లో ఫ్లోరిన్ శాతం సాధారణమేనని ఆరోగ్యశాఖ నివేదిక
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం నీటిలో ఫ్లోరోసిస్ శాతం 1 పీపీఎం పర్ మిలియన్) నుంచి 1.5 పీపీఎంలోపే ఉండాలి. గతంలో మునుగోడు నీటిలో 7 నుంచి 8శాతం పీపీఎం ఉండేది. నీళ్లు తాగడంతో ఎంతో మంది కాళ్లు, చేతులు వంకరపోయి జీవచ్ఛవాలుగా మారారు. ఐదేండ్లుగా మునుగోడుకు కృష్ణా శుద్ధ జలాలు సరఫరా అవుతున్నందున ఫ్లోరోసిస్ తగ్గినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఫ్లోరోసిస్ను రూపుమాపడానికి కేసీఆర్ తొలిసారి అధికారంలోకి వెంటనే మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టి మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్లో తొలుతగా ప్రారంభించారు. పనులు వేగవంతంగా చేపట్టి 2018 ఎన్నికలకు పోవడానికి ముందే ప్రతి ఇంటికీ తాగు నీరందించారు. నీళ్లు తాగడంతో మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరిన్ శాతం క్రమంగా కనుమరుగైంది. నేషనల్ హెల్త్ మిషన్ స్కీం కింద ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ఆరోగ్యశాఖ యంత్రాంగం ప్రతి పాఠశాలల్లోని విద్యార్థుల రక్తం తీసుకొని, సెరమ్ పరీక్ష చేయగా ఫ్లోరిన్ లేదని తేలింది. ఇటీవలి కాలంలో అక్కడ ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.
30ఏండ్లకే కాళ్లు వంకర్లు పోయినయి
ఫ్లోరైడ్ నీళ్లు తాగడంతో 30 ఏండ్లకే కాళ్లు వంకర్లు పోయినయ్. సోరతనంలో కూడా ముసలితనం ఆకారం వచ్చింది. అప్పుడు బోరు పైపులకు ఫ్లోరింగ్ అట్టలట్టలుగా అతికి పెచ్చులూడేది. ఏ నీళ్లు లేక ఆ నీళ్లు తాగినం. ఆ నీళ్లలో విషం ఉందని సర్వే డాక్టర్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు బరువు పనులు చేయాలంటే ఒళ్లంతా పట్టేసినట్టుగా ఉండి చేయలేకపోతున్నం. ఇప్పుడు మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు వస్తున్నయి. ఒళ్లు తేలికగా ఉంది. ఈ నీళ్లు తాగుతున్నాం ఇంతమటుకున్నం. లేకపోతే ఇంకా కష్టం అవుతుండే. తెలంగాణ రాకపోతే నీళ్లు రాకపోవునేమో. కేసీఆర్ మొండోడు. నీళ్లు తెచ్చిందాకా పట్టు వదలలే. మేమంతా ఆయనకే ఓటేస్తాం.
– పోలే నరసింహ, వట్టిపల్లికాలనీ, మర్రిగూడ మండలం
ఇప్పటి పిల్లల్లో ఫ్లోరైడ్ లేదు..
ఇప్పటి పిల్లల్లో ఫ్లోరైడ్ లక్షణాలు కనిపిస్త లేవు. పండ్లు తెల్లగా ఉంటున్నయి. కాళ్లు, చేతులు కూడా సరిగ్గానే ఉన్నయి. మిషన్ భగీరథ నీళ్లు మా భవిష్యత్ తరాలకు వరం. ఆంధ్ర పాలకుల పెత్తనంలో మాకు కనీసం మంచినీళ్లిచ్చే దిక్కు కూడా ఉండలేదు. ఉప్పుగా ఉండే నీళ్లు తప్పనిసరి పరిస్థితుల్లో తాగినం. ఫ్లోరైడ్ నీళ్లు కూడా దొరకకపోతే బిందెలు పట్టుకొని బోరు బావుల దగ్గరికి వెళ్లినం. ఆ నీళ్లనూ తిప్పలు పడుతూ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడా పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్ ఇంటింటికీ నల్లా ఇచ్చిండు. నల్లా రావడమే గొప్ప అనుకుంటే కృష్ణా నీళ్లు అందించిన సీఎం కేసీఆర్ నిజంగా మా పాలిట దేవుడు. ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేం. నీళ్లిచ్చిన కేసీఆర్ను ఎప్పుడూ మర్చిపోం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఆయనకే ఓటు వేస్తాం. మునుగోడు ప్రజలకే కాకుండా తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆర్ సారు నాయకత్వం చాలా అవసరం.
– రమావత్ లక్ష్మణ్నాయక్, రాజుపేటతండా, మర్రిగూడ మండలం
సీఎం కేసీఆర్ రాకతో నడక బాధ తప్పింది..
తెలంగాణ రాష్ట్రం రాకముందు మా ఊరికి నీళ్లు సక్రమంగా వచ్చేవి కావు. బావుల వద్దకు కిలోమీటర్ పైగా నడిచి నీళ్లు తెచ్చుకునేవాళ్లం. ఒక పూట మొత్తం నీళ్లకే సరిపోయేది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక మా ఊరికి మిషన్ భగీరథ నీళ్ల ట్యాంకు కట్టించి ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు రోజూ ఇంట్లోకే మంచినీళ్లు వస్తున్నాయి. పొద్దుగాళ్ల నీళ్లు ఇస్తుండడంతో పట్టుకొని పనులకు పోతున్నాం. బావులకాడికి పోయే బాధను తప్పించిన కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
– కమ్మల లక్ష్మమ్మ, దుబ్బకాల్వ, మునుగోడు మండలం
మంచినీళ్లు కొనే బాధ తప్పింది..
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు రోజూ ఫిల్టర్ నీళ్లు కొని తాగేవాళ్లం. టీఆర్ఎస్ సర్కారు వచ్చినంక ఆ బాధ తప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకంలో ఇంటింటికీ నల్లాలిచ్చి ఇంటి వద్దనే మంచినీళ్లు పట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న మా నియోజకవర్గాన్ని ఫ్లోరైడ్ రహితంగా మార్చిన కేసీఆర్కు రుణపడి ఉంటాం. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటాం.
– చిలువేరు లావణ్య, గృహిణి, మునుగోడు మండలం
సారు లేకపోతే నీళ్లు రాకపోవు..
సీఎం కేసీఆర్ సారు లేకపోతే మంచినీళ్లు రాకపోవు. 30 ఏండ్ల నుంచి నీళ్ల కోసం ఉద్యమం చేసినం. మాకు వచ్చిన బాధ భావితరాలకు రావొద్దు అనుకున్నాం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్లి నాయకులకు సమస్యలు చెప్పుకున్నాం. నీళ్లే మా నినాదంగా పని చేసినం. నీళ్లు వస్తాయి అనుకోలే.. హామీలివ్వడం తప్ప.. చేసిందేమీ లేదు. అప్పటి పాలకులకు మమ్ములను చూసినా చలనం రాలే. సీఎం కేసీఆర్ మునుగోడుకు ఏం చేసిండు అని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. తెలంగాణ రాకపోతే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. తెలంగాణ తెచ్చిన సారే మాకు నీళ్లివ్వడం సంతోషంగా ఉన్నది. కేసీఆర్ సార్కు మంచి పేరు వస్తుందని కొందరు రాజకీయ నాయకులు కుళ్లుకుంటున్నరు. బద్నాం చేయాలని చూస్తున్నరు. సీఎం సారే మా పాలిట దేవుడు.
– పానగంటి తిరుపతమ్మ, ఫ్లోరోసిస్ బాధితురాలు, వట్టిపల్లి గ్రామం
విషం నుంచి విముక్తి కలిగింది
సమైక్య పాలనలో ఇక్కడి ప్రాంత ప్రజలు ఫ్లోరైడ్ సమస్యతో నరకయాతన అనుభవించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మిషన్ భగీరథతో ఇక్కడి ప్రజలకు ఫ్లోరైడ్ మహమ్మారి నుంచి విముక్తి లభించింది. ఈ పథకం అమలుతోనే మునుగోడు నియోజకవర్గంలో ప్రస్తుతం ఫ్లోరైడ్ కేసుల సంఖ్య సున్నాకు చేరింది. సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ముఖ్యమంత్రి సారుకు ఎల్లవేళలా రుణపడి ఉంటాం.
– కొండపల్లి శివ, లక్కారం (చౌటుప్పల్)
ఫ్లోరైడ్ పీడ విరగడైంది
ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఫ్లోరైడ్ పీడ విరగడైంది. గతంలో విషపు నీళ్లు తాగి ఫ్లోరోసిస్ వ్యాధితో ఎముకలు గుళ్ల బారి కూర్చోవాలన్నా, నిలబడాలన్నా ఇబ్బంది పడేవాళ్లం. మా గోస చూసిన ఇక్కడ పరిశ్రమల వాళ్లు వాటర్ ఫిల్టర్ ఏర్పాటుచేసి మంచినీళ్లు అందించే ప్రయత్నం చేశారు. కానీ, ఫిల్టర్ నీటితో మనిషి ఆరోగ్యానికి ఉపయోగపడే మినరల్స్ కూడా పోయి నీరసించి పోయేవాళ్లం. సీఎం కేసీఆర్ దూరదృష్టితో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా ద్వారా నీరు అందించి ఫ్లోరైడ్ రక్కసి నుంచి విముక్తి కలిగించారు.
– ఢిల్లీ జగన్రెడ్డి, జైకేసారం (చౌటుప్పల్ రూరల్)
తాగునీటి తిప్పలు పోయినయి..
ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ తీసుకొచ్చి మా కష్టాలు తీర్చిండు. ఫ్లోరిన్ నీళ్లు తాగి శానా ఇబ్బంది పడ్డాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు మా గ్రామానికి నీళ్లు సక్రమంగా వచ్చేవి కావు. తాగునీటికి తిప్పలు పడ్డాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక మా ఊరిలో వాటర్ ట్యాంకులు కట్టిండ్రు. ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చిండ్రు. రోజూ ఉదయమే నీళ్లు వస్తున్నాయి. గతంలో ఫ్లోరిన్ నీళ్లు తాగినోళ్లకు ఆరోగ్య సమస్యలొచ్చినయి. ఇప్పుడా పరిస్థితి లేదు.
– సిలువేరు వసంత, గుజ్జ, సంస్థాన్ నారాయణపురం మండలం
భగీరథ నీళ్లతో ఆడబిడ్డల కష్టాలు పోయినయి..
గతంలో తండా గుట్టపై ఉన్న ఐదు దోనాల్లో నిల్వ ఉన్న నీళ్లు, బోరు, కుంటల నీళ్లే మాకు దిక్కు. ఫ్లోరిన్ నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యం పాడయ్యేది. ఆడబిడ్డలు నీళ్ల కోసం పడుతున్న కష్టాలు చూసి మా తండాకు పిల్లనివ్వాలన్నా భయపడేటోళ్లు. మిషన్ భగీరథ నీళ్లతో తండా ఆడబిడ్డల కష్టాలు పూర్తిగా తీరినయి. మా తండాకు నీళ్లొస్తయని కలలో కూడా అనుకోలేదు. భగీరథ నీళ్లు వస్తున్నప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు రావడం లేదు. నీళ్ల సమస్య తీర్చిన సీఎం కేసీఆర్ సారుకు ఆడబిడ్డలందరి తరఫున దండాలు.
– సభావత్ కలమ్మ, ఐదుదోనాల తండా, సంస్థాన్ నారాయణపురం మండలం
ఫ్లోరైడ్ను తరిమికొట్టిన మిషన్ భగీరథ..
గత పాలకుల నిర్లక్ష్యంతో మునుగోడు నియోజకవర్గం ఫ్ల్లోరైడ్ ప్రాంతంగా మారింది. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఆ భూతాన్ని తరిమికొట్టింది. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీరందించారు. దాంతో బయటికి వెళ్లి మంచినీళ్లు తెచ్చుకునే బాధ తప్పింది. ఇంట్లోకే శుద్ధి జలాలు ఇస్తున్న సీఎం కేసీఆర్కు అండగా ఉంటాం. ఈ ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసుకుంటాం
– రెడ్డిమల్ల రాంశంకర్, రావిగూడెం, మునుగోడు మండలం
బోరింగ్లు కొట్టే బాధ పోయింది..
కొన్నేండ్ల కిందట నీళ్ల కోసం శానా కష్టాలు పడ్డాం. బావుల కాడికి, బోరింగ్ల దగ్గరికి పోయి మంచినీళ్లు తెచ్చుకునేది. బోరింగ్ కొట్టి కొట్టి యాస్టకొచ్చేది. ఇప్పుడైతే సర్కారు పెట్టిన నల్లాతో ఇంట్లకే నీళ్లు వస్తున్నయి. బిందెలు మోసే బాధ తప్పింది. సర్కారు నీళ్లు కమ్మగా ఉన్నాయి. తాగుతుంటే తాగాలనిపిస్తది. మా బాధలు తీర్చిన సర్కారు చల్లగుండాలి.
– ఎడమ కొండమ్మ, సుంకిశాల, నాంపల్లి మండలం