అందరికీ విద్యను చేరువ చేయాలనే గొప్ప లక్ష్యంతో ముందుకెళ్తున్న వ్యక్తి ఆయన. సర్కారు బడులను బలోపేతం చేస్తూ ఆయా పాఠశాలలకు అండగా నిలుస్తున్నాడు. ఎవరూ అడగకున్నా నేనున్నానంటూ చేయూత ఇస్తున్న మంచి మనిషి కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్. పేదరికంతో ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కావొద్దనే లక్ష్యంతో 2017లో ‘కస్తూరి ఫౌండేషన్’ను ప్రారంభించి గత 7 ఏండ్లుగా విజయవంతంగా ముందుకెళ్తున్నారు.
ఓ వైపు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ వాటి బలోపేతానికి కృషి చేస్తున్నాడు. మరోవైపు సామాజిక స్పృహతో బీద కుటుంబాల్లోని ఆడబిడ్డల పెండ్లిళ్లకు పుస్తెమెట్టెలు అందచేస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తున్నాడు. అంతేకాకుండా ఎంతోమంది పేద విద్యార్థులకు ఫీజులు కట్టడం, నోట్బుక్స్, స్కూల్ బ్యాగ్స్ అందజేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు.
-రామగిరి, డిసెంబర్ 13
కస్తూరి శ్రీచరణ్ 22 జూన్, 2017న ‘కస్తూరి ఫౌండేషన్’కు శ్రీకారం చుట్టారు. డిసెంబర్ 14, 2017 నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో రూ.5 కోట్ల ఖర్చుతో సుమారు వందకు పైగా సర్కారు బడుల్లో మౌలిక వసతులు కల్పించారు. పేద విద్యార్థుల చదువు కోసం ఆర్థిక సాయం చేస్తున్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతియేటా మట్టి వినాయక విగ్రహాలతోపాటు జ్యూట్ బ్యాగులు పంపిణీ చేస్తున్నారు.
తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించేలా తల్లిదండ్రులను చైతన్యం చేసేందుకు అంగన్వాడీలను ప్రైవేట్ ప్లే స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు అంగన్వాడీ కేంద్రాలకు రూ.20 లక్షలతో పక్కా భవనాలు నిర్మించారు. మరో నాలుగు అంగన్వాడీలను రూ.8 లక్షలతో మెరుగుపర్చారు. ఆయా అంగన్వాడీల్లో చిన్నారులకు ఆట వస్తువులు, యూనిఫామ్ అందజేశారు.
పేదరికంలో ఉండి ఆడబిడ్డ పెండ్లి చేసే తల్లిదండ్రులకు పుస్తెమెట్టెలను సైతం ఉచితంగా అందించి అక్కున చేర్చుకుంటున్నారు. ఐదేండ్ల క్రితం ‘కస్తూరి కల్యాణమస్తు’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి తల్లిదండ్రులు లేని, నిరుపేద కుటుంబాలకు చెందిన 60 మంది ఆడబిడ్డల వివాహాలకు పుస్తెమెట్టలు అందజేశారు.
బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ఇప్పటికే మునుగోడు, సంస్థాన్నారాయణపురం, చౌటుప్పల్, తిరుమలగిరిలోని కేజీబీవీల్లో రూ.20 లక్షలతో మౌలిక వసతులు కల్పించారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ సీట్లు సాధించి ఆర్థిక చేయూత కోసం ఎదురుచూస్తున్న ఐదుగురు గిరిజన విద్యార్థినులకు రూ.20 వేల చొప్పున అందజేశారు.
అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి వినూత్నంగా నోట్ పుస్తకాలిచ్చే ఏటీఎంను ప్రారంభించనున్నారు. తమకు నోట్ పుస్తకాలు కావాలని ఎవరైనా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ధ్రువీకరణతో లెటర్ప్యాడ్తో వినతిపత్రం అందజేస్తే వారికి 24 గంటల్లో నోట్బుక్స్ పంపించే ప్రణాళికలు సిద్ధం చేశారు.