మిర్యాలగూడ, జూన్ 14: ప్రభుత్వ గుర్తింపు లేని కేఎన్ఎం 12510 రకం వరి ధాన్యాన్ని ప్రస్తుత వానకాలంలో కొనుగోలు చేయలేమని, రైతులు ఈ విషయాన్ని గమనించాలని రాష్ట్ర రైసు మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్, మిర్యాలగూడ రైసు మిల్లర్స్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్ పేర్కొన్నాన్నారు. ఆదివారం మిర్యాలగూడ రైసు మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత యాసంగిలో కొంతమంది రైతులు కేఎన్ం 12510 రకం ధాన్యం పండించి రైసు మిల్లర్లను ఇబ్బందులు పెట్టారన్నారు. ధాన్యం బియ్యంగా మారే ప్రక్రియలో తెల్లపేడు వస్తోందని, బియ్యం సైజు పొట్టిగా, లావుగా ఉంటోందని, ఈ కారణంతో సూపర్ ఫైన్ రకం కింద బియ్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. జై శ్రీరామ్, కావేరి చింట్లు, పూజ, హెచ్ఎంటీ వంటి సూపర్ ఫైన్ రకాలనే రైతులు సాగు చేయాలని సూచించారు. కేఎన్ఎం 12510 రకం విత్తనాలను ప్రభుత్వం ఇప్పటివరకు సర్టిఫైడ్ చేయలేదన్నారు.
ధాన్యాన్ని బియ్యంగా మార్చి మార్కెట్లో విక్రయించాలంటే సూపర్ ఫైన్ రకం బియ్యం కంటే రూ.వెయ్యికి పైగా తక్కువ ధరకు విక్రయించాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు.. ప్రభుత్వం గుర్తించిన సూపర్ ఫైన్ రకం వరిని మాత్రమే సాగు చేసి రైస్ మిల్లర్లకు సహకరించాలన్నారు. సమావేశంలో మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, ఉపాధ్యక్షుడు గోళ్ల రామశేఖర్, కార్యదర్శి పొలిశెట్టి ధనుంజయ, కోశాధికారి గందె రాము, రైసు మిల్లర్స్ జిల్లా నాయకులు డాక్టర్ బండారు కుశలయ్య, మిల్లర్లు జైని మురళి, గుడుగుంట్ల గణేష్, గార్లపాటి మధు, గార్లపాటి మట్టపల్లి, గుంటి గోపి, ఇల్లందుల లక్ష్మయ్య పాల్గొన్నారు.