కోదాడ, మార్చి 23 : కర్ల రాజేశ్ లాకప్ డెత్ కేసు విచారణలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. సోమవారం కోదాడలో ఆయన మాట్లాడుతూ.. విచారణ ప్రారంభించి మూడు నెలలు కావస్తున్నా ఇంకా పూర్తి కాకపోవడం వెనుక పోలీసులను కాపాడే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఈ కేసులో ప్రధాన బాధ్యులైన చిలుకూరు ఎస్ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద, శాఖపరమైన, చట్టపరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాల్సి ఉన్నా, అప్పటి డీఎస్పీ, ప్రస్తుత డీఎస్పి, ఎస్పీ నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. డీజీపీ శివధర్ రెడ్డి స్థాయికి ఫిర్యాదు వెళ్లే వరకు కేసు నమోదు కాకపోవడం శోచనీయమన్నారు. ఎస్సీ ఎస్టీ చట్టం సెక్షన్ 4 ప్రకారం వీరిపై కేసు నమోదు చేయాలన్నారు.
నాడు అడ్డగూడూరులో మరియమ్మ లాకప్ డెత్ జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వం వేగంగా స్పందించిందని, నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాలుగు నెలలు అయినప్పటికీ స్పందించకపోవడం దారుణమన్నారు. ఒక బీసీ సీఐని సస్పెండ్ చేసి, అగ్రవర్ణానికి చెందిన ఎస్ఐని కాపాడుతున్నారని ఆరోపించారు. త్వరలోనే అదనపు డీజీపీ మహేష్ భగవత్, ముఖ్యమంత్రిని కలిసి ఈ కేసులో న్యాయం జరిగేలా పోరాడుతామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. విచారణాధికారిగా ఉన్న డీఎస్పీ రవి ఈరోజు ఇచ్చిన హామీ మేరకు మూడు, నాలుగు రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏపూరి రాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా కన్వీనర్ పాతకోట్ల నాగరాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎమ్మార్పీఎస్ కోదాడ మండల అధ్యక్షులు పిడమర్తి చిన్న వెంకట్రావు మాదిగ, ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు కుడుముల శ్రీను, లంజపల్లి శ్రీను, కొండపల్లి సూర్య ప్రకాష్, ఆకారపు కొండలు, ములుగూరి సైదులు, పిడమర్తి పెద్ద వెంకట్రావు, పందింటి నవీన్, పంది శీను, కర్ల శివ, కర్ల ప్రేమ్, కర్ల కమల్ పాల్గొన్నారు.
కర్ల రాజేశ్ మృతి కేసులో దర్యాప్తు సాగుతోందని నల్లగొండ డీఎస్పీ రవి తెలిపారు. రాజేశ్ మృతికి సంబంధించిన హైకర్డ్ ఇంజెక్షన్ను ఆయన తల్లి లలితమ్మ నుండి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందని, మరో నాలుగైదు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి పీపీ (PP) అభిప్రాయం తీసుకున్న అనంతరం కేసును ఫైనలైజ్ చేస్తామని డీఎస్పీ పేర్కొన్నారు.