నల్లగొండ ప్రతినిధి, జనవరి21(నమస్తే తెలంగాణ) : కంటి వెలుగు కార్యక్రమానికి శనివారం సెలవు రోజు అయినప్పటికీ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల అధికారులు కొనసాగించారు. ఆదివారం పూర్తిగా సెలవు కాగా సోమవారం యాథావిధిగా సూర్యాపేట జిల్లాలోని 51 కేంద్రాల్లో, నల్లగొండ జిల్లాలోని 74 కేంద్రాల్లో పరీక్షల నిర్వహిస్తారు. ఇప్పటికే గ్రామాలు, పట్టణాల్లో వార్డుల వారీగా కంటివెలుగు శిబిరాల షెడ్యూల్ను ప్రకటించారు. నిర్దేశించిన షెడ్యూల్ మేరకు అన్నిచోట్ల క్యాంపులు నిరాటకంగా కొనసాగుతాయని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి వెల్లడించారు. మూడు రోజుల్లో నల్లగొండ జిల్లాలో మొత్తం 20,628 మందికి పరీక్షలు నిర్వహించారు.
కొనసాగిన పరీక్షలు
వాస్తవంగా కంటి పరీక్షలకు శని, ఆదివారాలను విరామంగా ప్రకటించారు. అయినా శనివారం నల్లగొండ జిల్లాలో 60 చోట్ల క్యాంపులు కొనసాగడం విశేషం. ఇప్పటికే 14 గ్రామాల్లో పరీక్షలు పూర్తి కాగా మరో 50 చోట్ల కొనసాగుతున్నాయి. పట్టణాల్లోని మూడు వార్డుల్లో వంద శాతం పూర్తి కాగా మరో 10 చోట్ల కొనసాగుతున్నాయి. వంద రోజుల్లో అన్ని గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ పరీక్షలు పూర్తి చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో నిర్వహించిన పరీక్షల్లో ఇప్పటివరకు 4,380 మందికి రీడింగ్ గ్లాసులు అందించారు. మరో 3600 ప్రిస్ర్కైబైడ్ గ్లాసెస్ కోసం ఆర్డర్ చేశారు. పరీక్షలు చేసిన వారిలో ఇప్పటివరకు 60.87 శాతంతో 12,557 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని గుర్తించారు. సూర్యాపేట జిల్లాలో శనివారం నేరడుచర్లలో మాత్రమే పరీక్షలు జరుపగా 178 మంది హాజరయినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో మూడు రోజుల్లో మొత్తం 10,690 మందికి కంటి పరీక్షలు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
జర్నలిస్టులు, ఉద్యోగులకు ప్రత్యేత క్యాంపులు
జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు, కోర్టు సిబ్బందితో పాటు మరికొన్ని వర్గాలకు త్వరలోనే ప్రత్యేక క్యాంపుల నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు. శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో తగు ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో ఉన్న బఫర్ టీంలతో రానున్న 15 రోజుల్లో ఈ క్యాంపుల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ వర్గాల వారీగా నిర్దిష్ట షెడ్యూల్ రూపొందించి ప్రత్యేక క్యాంపులు చేపట్టాలని సూచించారు. జిల్లాలో దీనిపై తగిన కార్యాచరణ రూపొందించి అమలు చేస్తామని జిల్లా అధికారులు ప్రకటించారు.
యాదాద్రిలో 9724 మందికి
భువనగిరి కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెండో విడుత కంటివెలుగులో భాగంగా జిల్లాలో మూడో రోజు కొన్ని ప్రాంతాల్లో క్యాంపులు కొనసాగాయి. శనివారం జిల్లాలో మొత్తం 2,391మందికి కంటి పరీక్షలు చేయగా 3,057మందికి కంటి అద్దాలు అందించారు. 2192 ప్రిస్కిప్షన్ అద్దాలు పంపిణీ చేయాల్సి ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మూడు రోజుల్లో మొత్తం 9724 మందికి కంటి పరీక్షలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
మూడు రోజుల్లో 20వేల మందికి కంటి పరీక్షలు
నల్లగొండ జిల్లాలో మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా 20 628 మందికి కంటి పరిక్షలు చేయగా 4380 మందికి కంటి అద్దాలు అందించినట్లు కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ రిజ్వీతో కలిసి ఆయా జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్పరెన్స్లో స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం కళ్లద్దాలు ఇచ్చిన వారితో పాటు దృష్టి లోపం ఉన్న 3600 మందిని గుర్తించి వారి అద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు చెప్పారు. డాటా ఎంట్రీ సమస్య లేకుండా సిబ్బందికి మరోసారి అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జనాభా ఆధారంగా 60 శాతం మందికి రీడింగ్ కళ్లద్దాలు అందుబాటులో ఉంచేలా జాగ్రత్త తీసుకుంటున్నట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా, మున్సిపల్ కమిషనర్ కేవీ రమణా చారి, డీపీఓ విష్ణువర్దన్ రెడ్డి, డీఎంహెచ్ఓ కొండల్ రావు పాల్గొన్నారు.
ఉచితంగా కంటి పరీక్షలు సంతోషకరం
ప్రభుత్వం కంటివెలుగు ద్వారా గ్రామానికి వచ్చి ఉచితంగా కంటి పరీక్షలు చేసి అద్దాలు ఇవ్వడం హర్షణీయం. పల్లె ప్రజలు పట్నానికి వెళ్లి రూ.3వేలు ఖర్చుపెట్టి పరీక్షలు చేయించుకొని అద్దాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా నేరుగా గ్రామాలకే వెళ్లి కంటి పరీక్షలు చేయడం అద్భుతం. ఇది పేదలకు నిజంగా వరమే.
– మల్లెల ఉప్పలయ్య, అరబిందో ఫార్మసీ సైన్టిస్ట్, రాయిపల్లి, ఆత్మకూరు(ఎం)
ఆనందంగా ఉంది
మాకు కంటి సమస్య వస్తే నాటు వైద్యాన్ని చేయించుకునే వాళ్లం. నాకు దగ్గర చూపు సమస్య ఉంది. పట్నం వెళ్లి పరీక్షలు చేయించుకోవడం కుదరక వెళ్లలేదు. రాష్ట్ర ప్రభుత్వం మా ఊళ్లనే కంటి వెలుగు శిబిరం పెట్టడంతో వెళ్లి పరీక్షలు చేయించుకున్న. డాక్టర్లు పరీక్ష చేసి అద్దాలు ఇచ్చారు. ఇప్పుడు నా సమస్య తీరింది. పైసా ఖర్చు లేకుండా కంటి పరీక్షలు చేసి మాలాంటి వాళ్లకు అద్దాలు మా ఊళ్లనే ఇవ్వడం ఆనందంగా ఉంది.
ఎర్రోళ్ల నర్సింహ, మర్యాల, బొమ్మలరామారం
పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చినరు
నాకు దూరం చూపు కనిపించదు. మూడేండ్ల క్రితం సీఎం కేసీఆర్సార్ మొదటి సారి కంటివెలుగు ద్వారా పరీక్షలు చేస్తుంటే వెళ్లి అద్దాలు తీసుకున్న. దాంతో సమస్య తీరింది. అయితే ఈ మధ్య అద్దాలు పగిలిపోయి మళ్లీ కండ్లు కనిపిస్తలేవు. మళ్లీ మా ఊళ్లనే కంటి వెలుగు కేంద్రం పెట్టడంతో ఆధార్కార్డు తీసుకొని పోయి పరీక్షలు చేయించుకున్న. డాక్టర్లు టెస్ట్ చేసి అద్దాలు ఇచ్చినరు. మాలాంటోళ్ల ఇబ్బందులు తీరుస్తున్న దేవుడు సీఎం కేసీఆర్.
జక్క చలమందారెడ్డి, లింగారెడ్డిగూడెం, చౌటుప్పల్ రూరల్
కంటి సమస్య తీరింది
నాకు దూరపు చూపు సరిగ్గా కనిపిస్తలేదు. ప్రభుత్వమే కంటి పరీక్షలు చేయిస్తుందని తెలిసి కంటి వెలుగు శిబిరానికి వచ్చాను. డాక్టర్లు కంటి పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చారు. ఇవి పెట్టుకున్నాక దూరంగా ఉన్నవి కూడ మంచిగా కనబడుతుంది. పైస ఖర్చు లేకుండా అద్దాలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
-శేరి మల్లమ్మ, మద్దిరాల