సూర్యాపేట, జనవరి 18 (నమస్తే తెలంగాణ) : రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభం కానుండగా.. అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 22 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆయా జిల్లాల్లో పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లతో పాటు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి పరికరాలను తరలించారు. ఒక్కో సెంటర్లో 120 నుంచి 150 మందికి కంటి పరీక్షలు చేయనున్నారు. అవసరమున్న వారికి కంటి అద్దాలు, ఐ డ్రాప్స్, మందులు సిద్ధం చేశారు. గురువారం ఉమ్మడి జిల్లాలో మంత్రి జగదీశ్రెడ్డితో పాటు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు.
ఏర్పాట్లు పూర్తి
కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లజోళ్లు, మందులు అందించడంతో పాటు ఆపరేషన్ చేయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం సూర్యాపేట జిల్లాలో 53 బృందాలు, నల్లగొండ జిల్లాలో 73, యాదాద్రిజిల్లాలో 34 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయగా ఒక్కో బృందంలో 8 మంది సభ్యులు ఉంటారు. నేటి నుంచి 100 రోజుల పాటు 18 సంవత్సరాలు పైబడిన వారికి కంటి పరీక్షలు చేయనున్నారు. సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో సుమారు 8 లక్షల చొప్పున, యాదాద్రి జిల్లాలో 6 లక్షలు మొత్తం ఉమ్మడి నల్లగొండ 22 లక్షల మందికి కంటి పరీక్షలు చేయనున్నారు. కంటి వెలుగునకు సంబంధించిన మెటీరియల్ ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాలకు చేరుకోగా పరీక్షలు చేసే కేంద్రాలకు తరలించారు. కంటి పరీక్షలు చేయడానికి ఉపయోగించే ఆటో రిఫ్రాక్టోమీటర్లు, ఐ డ్రాప్స్, యాంటీబయాటిక్స్, విటమిన్, పారాసిటమాల్, బీకాంప్లెక్స్ మందులు సెంటర్లకు చేర్చారు. దాంతో పాటు అవసరమైన వారికి అందించేందుకు సూర్యాపేట జిల్లాలో 44వేల కళ్లద్దాలు, నల్లగొండ జిల్లాలో 68 వేలు, యాదాద్రి జిల్లాలో 34వేలు అందుబాటులో ఉంచారు.
విస్తృత ప్రచారం
వివిధ రకాల కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులు అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా 2018లో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు. అదే స్థాయిలో రెండో విడుత కార్యక్రమాన్ని గురువారం ఉమ్మడి జిల్లాలో ప్రారంభించనున్నారు. ఇప్పటికే సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో కంటి పరీక్షలు చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఇప్పటికే ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. తదనంతరం గ్రామాలు, మున్సిపాల్టీల పరిధిలోని వార్డుల్లో కంటి వెలుగుపై విస్తృత ప్రచారం చేపట్టారు.
1వ వార్డులో ప్రారంభించనున్న మంత్రి జగదీశ్రెడ్డి
రెండో విడుత కంటి వెలుగును గురువారం సూర్యాపేట మున్సిపాలిటీ 1వ వార్డులో రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రారంభించనున్నారు. అందుకు ఏర్పాట్లు సైతం అధికారులు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని 29వ వార్డు సద్దుల చెరువు కట్ట వద్ద రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్రావు ప్రారంభిస్తారు. అలాగే నాగారం మండల కేంద్రంతో పాటు తిరుమలగిరి మండలం తొండలో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, కోదాడ మండలం అడ్డురూలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, హూజూర్నగర్ పట్టణంలోని 4వ వార్డు పద్మ శాలి భవనంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కంటి వెలుగును ప్రారంభించనున్నారు.
యాదాద్రి జిల్లాలో
జిల్లాలో గురువారం కంటి వెలుగు శిబిరాలు ప్రారంభం కానున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.మల్లికార్జున్రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తుర్కపల్లి మండలం ముల్కలపల్లిలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి కేంద్రాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి భువనగిరిలోని 2,17 వార్డులో అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి ప్రారంభిస్తారని, బొల్లేపల్లి పీహెచ్సీలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, మోత్కూర్లో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, సంస్థాన్నారాయణపురంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, రామన్నపేటలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కంటి వెలుగు శిబిరాలను ప్రారంభిస్తారని తెలిపారు. అందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.