త్రిపురారం, ఫిబ్రవరి 6 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంతో నిరుపేదలకు లబ్ధి చేకూరుతున్నదని ఎంపీపీ అనుముల పాండమ్మాశ్రీనివాస్రెడ్డి అన్నారు. త్రిపురారం మండలం సత్యనారాయణపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని సోమవారం జడ్పీటీసీ భారతీభాస్కర్నాయక్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నిరుపేదకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, అద్దాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ భారతీ భాస్కర్నాయక్, సర్పంచ్ మద్దూరి శ్రీనివాస్, ఎంపీటీసీ బైరెడ్డి హైమావతి, డాక్టర్ రమావత్ శంకర్, నాగరాజు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
9,259 మందికి కంటి పరీక్షలు
నీలగిరి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం నల్లగొండ జిల్లాలో 13వ రోజు కొనసాగింది. ఇప్పటి వరకు 1,13,195 మందికి వైద్య బృందం పరీక్షలు నిర్వహించింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 61 చోట్లా, పట్టణ ప్రాంతాల్లో 14 చోట్ల వైద్య పరీక్షలు నిర్వహించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 75 వైద్య బృందాలు 9,259 మందికి కంటి పరీక్షలు నిర్వహించాయి. వీరిలో 1312 మంది దగ్గర, 873 మందికి దూరం చూపు సమస్య ఉన్నందున కంటి అద్దాలు అందించారు. వివిధ కారణాలతో 7088 మందిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి రెఫర్ చేశారు. రెండు కండ్లల్లో రెండు రకాల సమస్యలు ఉన్నవారిలో ఇప్పటి వరకు గుర్తించిన 13 మందికి సోమవారం కళ్లద్దాలను అందించారు. కార్యక్రమంలో వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.