తిరుమలగిరి, జనవరి 8 : ప్రస్తుత యాసంగి సీజన్కు ఎస్సారెస్పీ రెండో దశ ద్వారా సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం జలాలు విడుదలయ్యాయి. జనగామ జిల్లా కొడకండ్ల మండలం బయ్యన్నవాగు రిజర్వాయర్ వద్ద తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి సోమవారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన జలాలకు పుష్పాభిషేకం చేశారు. అనంతరం సామేల్ మాట్లాడుతూ యాసంగి సీజన్లో రైతులకు ఇబ్బంది లేకుండా కాళేశ్వరం జలాలను విడుదల చేశామన్నారు.
ఈ నెల 8 నుంచి మార్చి 30 వరకు వారబందీ పద్ధతిలో నీటి విడుదల కొనసాగుతుందని, రైతులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. రోజుకు 4 వేల క్యూసెక్కుల చొప్పున 6 తడుల్లో 48 రోజులు నీటి విడుదల జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు నరేశ్, నీటి పారుదల శాఖ అధికారులు ఈఈ విజయ్కుమార్, డీఈలు సత్యనారాయణ, పిచ్చయ్య, నవీన్కుమార్, మురళీకృష్ణ, ఏఈలు అమర్నాథ్, స్వరూప, శ్రీకాంత్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కాళేశ్వరం జలాలు మూడు సంవత్సరాల నుంచి నిరంతరాయంగా వస్తుండడంతో కరువు ప్రాంతమైన తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలు సస్యశ్యామలయ్యాయి. తిరుమలగిరి మండలంలోని వెలిశాల 69 డీబీఎం నుంచి తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాలకు, 70 డీబీఎం ద్వారా నాగారం మండలం, 71 డీబీఎంతో నాగారం, అర్వపల్లి మండలాలతోపాటు సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూర్ ఎస్, చివ్వెంల, పెన్పహాడ్ మండలాలతోపాటు కోదాడ నియోజక వర్గంలోని మోతె, నడిగూడెం మండలాల్లోని పలు గ్రామాలకు కాళేశ్వరం జలాలు అందుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో ఎస్సారెస్పీ కింద 2,23,000 ఎకరాల ఆయకట్టు ఉన్నది.