వానకాలం పంటల సాగు సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం జలాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలుతీసుకున్నది. ఈ నెల 9న జనగాం జిల్లా బయ్యన్నవాగు నుంచి నీటిని విడుదల చేయనున్నది ఈ మేరకు అధికార యంత్రాంగం షెడ్యూల్ విడుదల చేసింది. ఏడు విడుతల్లో ఏడు రోజుల చొప్పున మొత్తం 49 రోజుల్లో 21 టీఎంసీల నీటిని అందించనున్నారు. సూర్యాపేట జిల్లాలోని 14 మండలాల్లో 2.13 లక్షల ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం జలాలు సరఫరా చేయనున్నారు.2.13 లక్షల ఎకరాలకు కాల్వల ద్వారా, 45వేల ఎకరాలకు 650 చెరువులు నింపడం ద్వారా సాగు నీరు చేరనున్నది. ఐదేండ్లుగా రెండు పంటలకు ప్రభుత్వం కాళేశ్వరం జలాలు విడుదల చేస్తుండగా ఈ సీజన్కుషెడ్యూల్ ఖరారు కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– సూర్యాపేట, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ)
సూర్యాపేట, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే ఆశించి సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నారో ఆ ఆశయం సిద్ధ్దిస్తున్నది. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలలో మూడొంతుల భాగం కరువు కాటకాలతో ఉండగా కాళేశ్వరం జలాలు నీటి కష్టాలను తీరుస్తున్నది. జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం మొత్తంతో పాటు సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో కొన్ని మండలాలు అలాగే హుజూర్నగర్ నియోజకవర్గం పరిధిలోని కొంతమేర విస్తీర్ణం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఐదేండ్లుగా రెండు పంటలకు నీరందుతున్నది. అలాగే ఈ వానకాలానికి సంబంధించి ఆయకట్టుకు నీటి విడుదలపై షెడ్యూల్ ఖరారైంది.
వానకాలం సీజన్కు సంబంధించి కాళేశ్వరం జలాల విడుదల షెడ్యూల్ ఖరారు కావడంతో ఆయకట్టు పరిధిలోని 2.58 లక్షల ఎకరాలకు ఢోకా లేకుండా పోయింది. కాల్వల ద్వారా 2.13 లక్షల ఎకరాలకు నేరుగా పంట పొలాల్లోకి నీరు అందిస్తుండగా కాళేశ్వరం ఆయకట్టు పరిధిలో ఉన్న దాదాపు 650 చెరువులను నింపడం ద్వారా మరో 45 వేల ఎకరాలకు మొత్తం 2.58 ఎకరాలను రైతులు సాగు చేయనున్నారు. అత్యధికంగా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో 94,291 ఎకరాలకు సాగునీరు అందుతుండగా తిరుమలగిరి మండలంలో 3,360 ఎకరాలు, తుంగతుర్తి 24,102, జాజిరెడ్డిగూడెం మండలం 15, 967, నాగారం 13,625, నూతనకల్ 19,213, మద్దిరాల మండలంలో 18,024 ఎకరాలకు కాళేశ్వరం జలాలు అందనున్నాయి. అలాగే సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు కలిపి 75,849 ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు రానుండగా వీటిలో సూర్యాపేట మండలంలో 13,437, ఆత్మకూర్.ఎస్ 29,938, చివ్వెంల 18,912, పెన్పహాడ్ 13,562 ఎకరాలకు అలాగే కోదాడ నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల్లో 42,796 ఎకరాలకు నీరందుతుండగా మునగాల మండలంలో 12,416, మోతె26,888 అలాగే నడిగూడెం మండలంలో 3,492 ఎకరాలకు అందుతుండగా హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని గరిడేపల్లి మండలాల్లో 239 ఎకరాలకు కాళేశ్వరం జలాలు అందుతాయి.
ఆగస్టు 9 నుంచి నవంబర్ 7 వరకు ఏడు విడుతలుగా నీటిని విడుదల చేయనున్నారు. ప్రతి విడుతలో ఏడు రోజుల పాటు కాల్వల్లో నీటి ప్రవాహం కొనసాగనుంది. రోజుకు 5 వేల క్యూసెక్కుల చొప్పున ఏడు రోజులకు 35 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనుండగా మొత్తం 49 రోజుల్లో 2,45,000 క్యూసెక్కులు అంటే 21 టీఎంసీల నీటిని జిల్లాకు వినియోగించనున్నారు.
జిల్లాకు నీటిని అందించేందుకు షెడ్యూల్ ఖరారైంది.మంత్రి జగదీశ్రెడ్డి ఆదేశాల మేరకు కాల్వల్లో ఉన్న కంప చెట్లను చాలా వరకు తొలగించాం. నీటి విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. పంట చేతికి వచ్చేంత వరకు నీటిని విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. ఒకవేళ నవంబర్ 7 తరువాత కూడా అవసరం నీటిని విడుదల చేస్తాం.
-రమేశ్బాబు, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్