కాళేశ్వరం ప్రాజెక్టు సూర్యాపేట జిల్లాకు వరప్రదాయినిగా మారింది. గతంలో చుక్కనీరు లేక బీడుబారిన నేలల్లో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. చెరువులు, కుంటలు జలకళ సంతరించుకోగా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఫలితంగా నేడు ఎక్కడ చూసినా పంట పొలాలే దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా తుంగతుర్తి నియోజకవర్గం సస్యశ్యామలమైనది. సూర్యాపేట, కోదాడలోని పలు ప్రాంతాలు సైతం గోదావరి జలాల రాకతో పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు సైతం తిరిగి సొంతూళ్లకు వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. దీనికి తోడు భూముల ధరలు భారీగా పెరిగాయి. ఇదంతా గోదావరి జలాల రాకతోనే జరిగిందనేది సత్యం. వరుసగా తొమ్మిదోసారి కాళేశ్వరం నీటి విడుదల చేయడంతో యాసంగి పంటల సాగులో రైతులు నిమగ్నమయ్యారు.
– సూర్యాపేట, జనవరి 9 (నమస్తే తెలంగాణ)
నీళ్లు పుష్కలంగా రావడంతో భూములన్నీ పచ్చని పంట పొలాలతో కనిపిస్తున్నాయి. దాంతో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఐదారేండ్ల క్రితం శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలో ఎకరా రూ.లక్ష నుంచి 3 లక్షలు ఉండగా నేడు రూ.30 లక్షలకు చేరింది. గతంలో నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో ఎకరాకు రూ.15 లక్షల నుంచి 20 లక్షలు అంటే అక్కడేమైనా బంగారం పండిస్తారా అని అనుకునేవారు. కానీ తుంగతుర్తి నియోజకవర్గంలోనూ బంగారు పంటలకు నిలయంగా మారింది. భూముల ధరలు ఇలా పెరుగుతాయని కలలో కూడా ఊహించలేదని రైతులు పేర్కొంటున్నారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో 1.62 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా నాలుగేండ్ల క్రితం వరకు 25వేల ఎకరాల్లో మాత్రమే వరి పండేది. మరో 70వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు వేసేవారు. కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు రావడంతో 1.42 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నది. వరి దిగుబడుల్లో తుంగతుర్తి నియోజకవర్గం అన్నపూర్ణగా మారింది. పండిన పంటలతోపాటు ఏడాదికి రెండు సార్లు ప్రభుత్వం అందించే పంట పెట్టుబడి సాయం రైతులు ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నారు. దాంతో పాత ఇండ్లను ఆధునీకరించుకుంటున్నారు. బైక్లు, కార్లు కొంటున్నారు. రాబడి ఎక్కువ ఉన్న రైతులు పట్టణాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేస్తున్నారు.
గతంలో పంటలు పండించడానికి నీళ్లు కుటుంబాలను పోషించుకోవడమే కష్టతరంగా ఉండేది. భూములు ఉన్నా పడావు పెట్టేది. శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలో 2.95 లక్షల ఎకరాలు ఉన్నా సాగుకు యోగ్యంగా పది శాతం కూడా ఉండేది కాదు. ఊర్లో పనుల్లేక రైతులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. సూర్యాపేట జిల్లా పరిధిలోని తుంగతుర్తి నియోజకవర్గంతోపాటు సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లోని ఆత్మకూర్.ఎస్, చివ్వెంల, మోతె తదితర మండలాల్లో ఈ పరిస్థితి ఉండేది. కాళేశ్వరం జలాలు రావడంతో సస్యశ్యామలంగా మారాయి. ఇంచు భూమి లేకుండా సాగవుతున్నది. వలస వెళ్లిన రైతులు సొంతూళ్లకు వచ్చి వ్యవసాయం చేస్తుండగా వృత్తిదారులతోపాటు కూలీలకు చేతి నిండా పని దొరుకుతున్నది.
నాకు నాలుగున్నర ఎకరాల భూమి ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఒక్క బోరుతో రెండెకరాలు మాత్రమే పారేది. కరెంట్ ఎప్పుడు వస్తదో అని ఎదురు చూసేవాళ్లం. నీళ్లు లేక మా భూమి బీడుగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినంక మాకు నీళ్లకు ఇబ్బంది లేదు. ఇప్పటికి తొమ్మిదిసార్లు ఎస్సారెస్పీ కాల్వలో నీళ్లు వస్తున్నాయి. బీడు భూములు సస్యశ్యామలంగా మారాయి. ఉచితంగా 24గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా పథకాలు రైతులకు కొండంత అండగా నిలుస్తున్నాయి. పండించిన పంటలను కూడా ప్రభుత్వమే కొంటుండడంతో రైతులకు ఇబ్బందులు తప్పాయి. సీఎం కేసీఆర్తోనే ఇదంతా సాధ్యమైంది. ఆయనకు రుణపడి ఉంటాం.
-తరాల ఆంజనేయులు, నర్సింహులగూడెం, నాగారం మండలం
నాకు ఆరు ఎకరాల భూమి ఉన్నది. గతంలో నీటి సౌకర్యం లేక ఒక ఎకరం మాత్రమే సాగు చేసే వాడిని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సీజన్లో గోదావరి నీళ్లు విడుదల చేస్తున్నారు. కంచెగా ఉన్న 5ఎకరాల భూమిని పొలంగా మార్చి మొత్తం ఆరు ఎకరాలు సాగు చేస్తున్నా. 71డీబీఎం నుంచి మైనర్ కాల్వ ద్వారా గోదావరి జలాలు వస్తున్నాయి. భూములు కూడా ఇప్పుడు మంచి ధర పలుకుతున్నాయి. పూర్తిగా గోదావరి జలాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నా. రైతుల గురించి ఆలోచించే సీఎం కేసీఆర్ ఉండడం మన అదృష్టం.
-గోసుల విజయ్కుమార్, రైతు, బొల్లంపల్లి, అర్వపల్లి మండలం