నకిరేకల్, జనవరి 2 : సంక్రాంతి సందర్భంగా చిరుమర్తి చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గ స్థాయిలో కబడ్డీ పోటీలను నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. నకిరేకల్లోని క్యాంపు కార్యాలయంలో సోమవారం మండల విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల వ్యాయామ విద్యా ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి 11 వరకు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల బాలబాలికల కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నకిరేకల్ అవుట్ డోర్ స్టేడియం మినీస్టేడియం)లో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పోటీలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. బాలబాలికలకు వేర్వేరుగా పోటీలను నిర్వహించి విజేతలకు బాలికల నుంచి 8 జట్లు, బాలుర నుంచి 8 జట్లకు బహుమతులను అందజేయనున్నట్లు చెప్పారు.
మొదటి బహుమతిగా రూ.20 వేలు, రెండో బహుమతిగా రూ.15 వేలు, మూడో బహుమతిగా రూ.10 వేలు, నాలుగో బహుమతిగా 8 వేలు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది జట్లకు రూ.5 వేల చొప్పున బహుమతులు అందజేయనున్నట్లు వివరించారు. ముగింపు వేడుకలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరై బహుమతులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు అవుట్ డోర్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, కమిషనర్ బాలాజీ, ఎంఈఓ నాగయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మురారిశెట్టి ఉమారాణీకృష్ణమూర్తి, పీఈటీ చింతకాయల పుల్లయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఎల్ఓసీ అందజేత
కేతేపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన ఉయ్యాల ఎల్లమ్మకు సీఎం సహాయ నిధి నుంచి రూ.2 లక్షల నుంచి మంజూరయ్యాయి. సంబంధిత ఎల్ఓసీ పత్రాన్ని ఆమె కుటుంబ సభ్యులకు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అందజేశారు.