సూర్యాపేట, మే 23(నమస్తేతెలంగాణ):కాంగ్రెస్ గూం డాల చేతిలో హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధుది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం రాత్రి కాంగ్రెస్ గూండాల చేతుల్లో హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు మధు మృతదేహం వద్ద శనివారం జగదీశ్రెడ్డి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సం దర్భంగా ఏర్పాటు చేసిన మీడియాతో జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ మధు హత్యలో పోలీసుల భాగస్వామ్యం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం సరి కాదన్నారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం సస్యశ్యామలంగా పదేండ్ల పాటు ప్రశాంతంగా ఉండేదని గుర్తు చేశారు. గతంలో నల్లగొండ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలతో వందలాది హత్యలు జరిగాయని, ఎన్నికలోస్తే ఎన్ని హత్యలు జరుగుతాయో అనే దారుణ పరిస్థితి ఉండేదన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో శాంతి భద్రతలను పూర్తిగా అదుపులో ఉంచి పోలీసులు స్వేచ్ఛగా పని చేసుకునేలా వాతావరణం కల్పించామన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎన్నో అరాచకాలను చూస్తున్నామని కాంగ్రెస్ గూండాలు, రౌడీల చేతుల్లోనే పోలీస్ స్టేషన్లు నడుస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులను స్టేషన్లకు పిలిపించి మరీ కాంగ్రెస్ గూండాల ముందు నిలబెట్టి అవమానిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్కు పోలీసులు తొత్తులుగా మారడం సిగ్గు చేటన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వెళ్లిన తమ పార్టీ ప్రజా ప్రతినిధులను సైతం అవమానిస్తున్నారన్నారు. అనేక సందర్భాల్లో పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. గతంలోనూ కాంగ్రెస్ గూండాలు తమ పార్టీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్నను దారుణంగా హత్య చేశారన్నారు.
నువ్వు ఎగిరిపోతావని మధుకు స్వయంగా చెప్పిన ఎస్సైకి మధును కాపాడే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. మధును నమ్మించి తీసుకెళ్లి కిరాతకంగా హత్య చేశారని ఈ హత్యకు కాంగ్రెస్ నాయకులు, పోలీసులే బాధ్యులన్నారు. కేసు విషయంలో పోలీసులు కాంగ్రెస్కు తొత్తులుగా వ్యవహరిస్తే తర్వాతైనా ఆ కేసులను తిరగతోడతామన్నారు. విచారణలో తప్పు చేస్తే ఐజీ స్థాయి అధికారులను కూడా పదేళ్ల తరువాత జైళ్లకు పంపిన ఘటనలు ఎన్నో చూశామని, నిజమైన నిందితులెవరో గుర్తించి, శిక్షపడేలా పోలీసులు పని చేయాలన్నారు. మధు కుటుంబానికి అండగా ఉంటామని, ఇద్దరు ఆడ పిల్ల ల చదువు బాధ్యత, కుటుంబ పోషణ బాధ్యతను బీఆర్ఎస్ తీసుకుంటుందని జగదీశ్రెడ్డి వెల్లడించారు. ఆయన వెంట రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం, ప్రభాకర్రెడ్డి, ముదిరెడ్డి అనిల్రెడ్డి తదితరులు ఉన్నారు.