సూర్యాపేట, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర మంత్రిగా, సూర్యాపేట ఎమ్మెల్యేగా పనిచేసిన గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూర్యాపేటకు వేలాది కోట్లు తెచ్చి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కానీ గత రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టణాభివృద్ధికి రూపాయి కూడా మంజూరు కాలేదు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించడంతో ఇప్పటికైనా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి పట్టణాభివృద్ధికి నిధులు మంజూరు చేస్తారని పట్టణ ప్రజలు ఆశిస్తున్నారు. పట్టణ ప్రజలు సూర్యాపేటను ఉమ్మడి రాష్ట్రంతో పోల్చుకుంటూ.. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జగదీశ్రెడ్డి పట్టణాన్ని ఎంతగా అభివృద్ధి చేశారో అంటూ గుర్తు చేసుకుంటున్నారు.
అలాంటిది రెండేళ్లలో కాంగ్రెస్ పాలనలో సూర్యాపేటకు నయాపైసా కూడా మంజూరు కాకపోవడంతో కొత్తగా ఏర్పాటైన పాలకవర్గం ఏ మేరకు నిధులు తీసుకురాగలరోనని జనం ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి గత రెండేళ్లలో పట్టణంలో ప్రతి రోడ్డును తవ్వడంతో గుంతలు, దోమలు, పందులు, పారిశుద్ధ్య నిర్వహణా లోపం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా జగదీశ్రెడ్డి హయాంలో కోట్లాది రూపాయలు వెచ్చించి సద్దుల చెరువును మినీ ట్యాంక్బండ్గా మార్చి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దితే.. నేడు ఎండిన చెట్లు… చెత్తచెదారం దర్శనమిస్తున్నాయి. మహాప్రస్థానం దీన స్థితికి చేరుకుంది. కనీసం నాడు వేసిన మొక్కలకు నీళ్లను కూడా పోయలేని వైనం రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ దివాళాకోరు తనానికి నిదర్శనమని పలువురు ధ్వజమెత్తాతున్నారు.
సూర్యాపేటకు మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి హయాంలో మంజూరు చేయించిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత వెనక్కి పంపింది. దీనికి తోడు జగదీశ్రెడ్డి హయాంలో ప్రారంభమైన పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. నూతన పాలకవర్గం కొలువు తీరడంతో వెనక్కి మళ్లిన నిధులు మళ్లీ వస్తాయోమోననే ఆశతో పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. సూర్యాపేటలో భానుపురి కళాభారతి, స్టేడియం ఆధునికీకరణ, స్పోర్ట్స్ స్కూల్, పాలిటెక్నిక్ కళాశాల,హాస్టల్ భవనం, స్కిల్ డెవలప్మెంట్ తదితర కార్యక్రమాలు చేపట్టేందుకు నాడు జగదీశ్రెడ్డి దాదాపు రూ.250 కోట్లు మంజూరు చేయించగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత వాటిని వెనక్కు మళ్లించింది. వీటితో పాటు పుల్లారెడ్ది చెరువును మినీ ట్యాంక్బండ్గా మార్చేందుకు నిధులు తెచ్చి సగం పనులు పూర్తయితే ఆ పనులు కూడా నిలిచిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆగమైన సూర్యాపేట జగదీశ్రెడ్డి హయాంలో అందంగా మారగా రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో సూర్యాపేటను పట్టించుకున్న నాధుడే లేడు. జగదీశ్రెడ్డి చేసిన అభివృద్ధి పనులను కాపాడలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి జిల్లా మంత్రిగా ఉన్నా మొత్తం ఐదారు సార్లు కూడా సూర్యాపేటకు రాకపోగా నిధులు మంజూరు చేసిన దాఖలాలు కూడా లేవు. మరి ఇప్పుడైనా మంత్రి నిధులు ఇచ్చేనా..? నూతన పాలకవర్గం నిధులు ఏమేరకు తెస్తారు..? అని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.