సూర్యాపేట, జూలై 26 (నమస్తే తెలంగాణ) : రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తున్నదని కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని దుష్ప్రచారం చేస్తూ వచ్చి, ఇప్పుడు లిఫ్టు మోటార్లు ఆన్ చేస్తే జనం వారిని విశ్వసించరని దుర్మార్గంగా ఆలోచిస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరువు ప్రకృతి సిద్ధంగా వచ్చినది కాదని, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువేనన్నారు. వెంటనే కాళేశ్వరం పరిధిలోని బ్యారేజీల వద్ద మోటార్లు ఆన్ చేసి నీళ్లు ఇవ్వాలని లేకుంటే సూర్యాపేట నుంచే జనం రైతులు, తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. అలాగే గతంలో హైదరాబాద్ నుంచి అమరావతికి చౌటుప్పల్, చిట్యాల, నకిరేకల్ సూర్యాపేట, కోదాడ మీదుగా బుల్లెట్ ట్రైన్ రూట్ అని ప్రకటించి నేడు అలైన్మెంట్ మార్చడం పట్ల ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారని, వెంటనే అలైన్మెంట్ మార్చి పాత అలైన్మెంట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఆదివారం సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో జగదీశ్రెడ్డి మీడియాతో మాట్లాడారు. గోదావరిలో ప్రస్తుతం దాదాపు లక్ష క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయని కానీ ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలతో పాటు అనేక ప్రాంతాలకు మాత్రం నీళ్లు రావడం లేదన్నారు. కన్నెపల్లి వద్ద లిఫ్టు మోటార్లు ఆన్ చేస్తే నీళ్లు నేరుగా పంట పొలాల్లోకి వస్తాయని, కానీ మోటార్లు ఆన్ చేస్తే కేసీఆర్కు పేరు వస్తుందని, తమకు ఉపయోగం ఉండదని కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖపు పట్టుదలతో ఉన్నదన్నారు. నీటిని తోడి పోయకపోవడమంటే కోట్లాది మంది జనం, రైతుల ఉసురు పోసుకోవడమేనని, ఇది ఎంతటి బాధ్యతారాహిత్యమో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు.
వెంటనే కన్నెపల్లి పంపు హౌజ్ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా విద్యుత్తు సరఫరాలో తీవ్ర అంతరాయం ఉంటోందని, రోజుకు పది గంటలకు మించి రావడం లేదని, దీంతో రైతులు బావురుమంటున్నారని మళ్లీ ఉమ్మడి రాష్ట్ర పరిస్థితులు పునరావృతం అవుతున్నాయన్నారు. నీళ్లు లేక మళ్లీ బోరింగ్ రిగ్గు బండ్లు కనిపిస్తున్నాయని ఎక్కడ పంట చెలకల్లో చూసినా బోర్లు వేస్తూ మళ్లీ రైతులు జేబుల ఖాళీ చేసుకుంటూ అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వేళ బోర్లు వేసినా విద్యుత్తు లేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం కళ్లు తెరవాలని సూచించారు. రైతులు, ప్రజలు ఇంతటి దుర్మార్గమైన ప్రభుత్వ మెడలు వంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తిరుగుబాటు తప్పదని అది సూర్యాపేట నుంచే ప్రారంభం అవుతుందని జగదీశ్రెడ్డి హెచ్చరించారు.
దాదాపు ఏడాది కాలంగా హైదరాబాద్ నుంచి అమరావతికి బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేస్తున్నామని, హైదరాబాద్, చౌటుప్పల్, చిట్యాల, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ మీదుగా అమరావతి వెళుతుందని నాడు పదేపదే చెప్పారని జగదీశ్రెడ్డి గుర్తు చేశారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఆశలు పెట్టుకున్నారన్నారు. ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని ఇక్కడి ప్రజలకు కూడా ట్రైన్ అవసరం ఎంతో ఉందని చెప్పారు. అంతే కాకుండా ఈ రూట్లో ట్రైన్ నడిపితే ప్యాసింజర్లు కూడా ఎక్కువగా ఉంటారన్నారు. అయితే మిగతా రైళ్ల మాదిరి అన్ని గ్రామాల్లో ఆగకపోవచ్చని, కొన్ని లిమిటెడ్ హాల్ట్స్ ఉండవచ్చని అయినా నల్లొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల నుంచి వెళ్లేవి కాబట్టి ఈ ప్రాంతాలకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. కానీ రూట్ మార్చి మరో వైపు నుంచి మళ్లిస్తున్నారని ఇది ఈ ప్రాంత ప్రజలకు ఆందోళన కల్గిస్తున్న విషయమన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేయాలని అలాగే ఈ ప్రాంత కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి పాత పద్ధతుల్లో అలైన్ మెంట్ ఉండేలా చూడాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తమ వంతు కృషి తాము చేస్తామన్నారు.