పెద్దఅడిశర్లపల్లి, జనవరి 2 : ధరణి నిలిపివేత దిశగా కొత్త ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే ధరణికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చే భూమాత పేరు మార్పిడితోపాటు ధరణిలో మాడ్యూ ల్స్ మార్పిడిపై సాంకేతిక బృందం కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం ధరణిలో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ తప్ప మిగతా పనులు అధికారులు పూర్తిగా నిలిపివేయగా తాజాగా రెండు రోజుల నుంచి సిటిజన్ లాగిన్ ఓపెన్ కావడం లేదు. సిటిజన్ లాగిన్ అయ్యే క్రమంలో ఫోన్కు వచ్చే ఓటీపీని పూర్తిగా నిలిపివేశారు. దీంతో స్లాట్ బుక్ చేసుకునే అవకాశం లేదు. కానీ తాసీల్దార్ లాగిన్లో మాత్రం రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇప్పటికే ధరణిలో పేమెంట్ కట్ చేసి స్లాట్ బుక్ చేయకుండా ఉండడంతో కొందరు ఆందోళనకు గురవుతున్నారు. ముందస్తు ప్రకటన లేకుండా సిటిజన్ లాగిన్ నిలిపివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత సులభంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతున్న ధరణి మార్పిడితో నూతనంగా వచ్చే పోర్టల్పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ధరణిలో మాడ్యుల్స్ చెకింగ్ కారణంగా సర్వర్ సమస్యతో తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.