నార్కట్పల్లి, జూన్ 07 : బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన గంధమళ్లకు మళ్లీ శంకుస్థాపన చేయడం సిగ్గుచేటని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నాడు కాంగ్రెస్ నాయకులు అడ్డం పడిన ప్రాజెక్ట్ ఇప్పుడు నిర్మిస్తారా? కాళేశ్వరం, మల్లన్నసాగర్ లేకుండా గంధమల్లకు నీళ్లు రావు అనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గ్రహించాలని ఆయన హితవు పలికారు. శనివారం నార్కట్పల్లిలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు జిల్లాలో ఉన్న కాంగ్రెస్ హేమాహేమీలు అప్పుడు రైతులను రెచ్చగొట్టి ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డుపడ్డట్లు దుయ్యబట్టారు. కాంగ్రెస్ అంటేనే కయ్యాలకు కాలు దువ్వుతూ, రాజకీయ అదిపత్యాలకు తావు తీసే పార్టీ అని అన్నారు.
రాష్ట్రాన్ని గత 10 ఏండ్లు పారదర్శకంగా ముందుకు నడిపిన పార్టీ బీఆర్ఎస్ అని కొనియాడారు. నేడు రాష్ట్ర పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు. దీంతో మళ్లీ సీఎంగా కేసీఆరే రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ను తిట్టడానికే సీఎం రేవంత్ ఆలేరులో సభ పెట్టుకున్నట్లు ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ స్వాగతం పలికిందే తప్పా ఎక్కడా అడ్డుకోలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమి లేదన్నారు. చిల్లర మాటలు, తిట్ల దండకాలతో కాలం వెళ్లదీస్తున్నట్లు మండిపడ్డారు. ప్రాణాలను ఫణంగా పెట్టి రాస్ట్రాన్ని సాధించిన కేసీఆర్ను తిట్టడాన్ని రేవంత్ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
యాదగిరి క్షేత్ర సన్నిధిలో మెడికల్ కళాశాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.182 కోట్లు మంజూరు చేసి హరీష్రావు శంకుస్థాపన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. చేసిన పనులకే శంకుస్థాపన చేయడం సిగ్గుచేటు అన్నారు. యాదాద్రిని యాదగిరిగుట్టగా మార్చడాన్ని ఎవరు స్వాగతించలేదన్నారు. వందల సంవత్సరాలైనా కేసీఆర్ పేరు యాదగిరి క్షేత్రంపై సువర్ణాక్షరాలతో చెక్కబడే ఉంటుందన్నారు. ప్రపంచ సుందరీమణులు వచ్చినపుడు చూపెట్టినవన్నీ కేసీఆర్ ఆనవాల్లే అన్నారు. పదేండ్లు కేసీఆర్ సంపద సృష్టిస్తే కాంగ్రెస్ కొల్లగొడుతుందన్నారు.
రైతు రుణమాఫి పూర్తిగా ఇవ్వకపోవడంతోనే రైతలు ఆలేరు సభకు రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలెవరూ సంతోషంగా లేరన్నారు. మొత్తంగా కాంగ్రెస్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు దోసపాటి విష్ణుమూర్తి, మాజీ ఎంపీటీసీ చిరుమర్తి యాదయ్య, మాజీ సర్పంచ్ కర్నాటి ఉపేందర్, దుబ్బాక శ్రీధర్, పక్కీర్ సత్తిరెడ్డి, జినుకల కార్తీక్ పాల్గొన్నారు.