యాదగిరిగుట్ట, ఏప్రిల్ 18: హైదరాబాద్ కోకాపేటలోని దొడ్డి కొమురయ్య ఆత్మగౌరవ భవనం లీజును రద్దు చేయకపోతే ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, మాజీ ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం మూల్యం చెల్లించక తప్పదని కురుమ సంఘం రాష్ట్ర నాయకులు కర్రె వెంకటయ్య, మాదారం కృష్ణ హెచ్చరించారు. కురుమ నాయకులమని చెప్పుకునే బీర్ల అయిలయ్య, యెగ్గె మల్లేశం సంఘ భవనాన్ని ఆంధ్రాలోని నారాయణ కళాశాల యజమాన్యానికి లీజుకిచ్చి రూ. కోట్లు దండుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. లీజును కొనసాగించాలని చూస్తే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీలను కురుమలంతా కలిసి తరిమికొడతారని హెచ్చరించారు.
శనివారం వారు గుట్టలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వ హయాం లో కోకాపేటలో 5 ఎకరాల భూమి కేటాయించి, రూ. 5 కోట్లతో కురుమల ఆత్మగౌరవానికి ప్రతీకగా దొడ్డి కొమురయ్య ఆత్మగౌరవ భవనం నిర్మించారన్నారు. కురుమ కులస్తులను గౌరవిస్తూ యెగ్గె మల్లేశాన్ని ఎమ్మెల్సీ చేస్తే కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు. కురుమ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే అదే కులానికి చెందిన వారినే మోసగిస్తూ భవనాన్ని తాకట్టుపెట్టేందుకు సిద్ధమయ్యారన్నారు. 15 ఏళ్ల క్రితం కురుమలంతా కలిసి యాదగిరిగుట్టలో చండీశ్వర సదనం నిర్మించుకున్నామన్నారు.
యెగ్గె మల్లేశం, అయిలయ్య కలిసి చండీశ్వర సదనాన్ని ప్రైవేట్ సైనిక్ స్కూల్కు లీజుకిచ్చారన్నారు. అడిగితే ఆ భవనం తనదని, కురుమ సంఘానికి ఎలాంటి సంబంధం లేదని మల్లేశం చెప్పడం సిగ్గు చేటన్నారు. గుట్ట ప్రెసిడెన్సియల్ సూట్ పక్కనే సర్వే నంబర్ 327లో కురుమ సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని గత ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి కోరితే సానుకూలంగా స్పందించారన్నారు. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన బీర్ల అయిలయ్య ఆ స్థలాన్ని ముదిరాజ్ భవనానికి కేటాయించారని అన్నారు. అయిలయ్య స్పందించి కురుమ సంఘ భవన నిర్మాణానికి పక్కనే ఉన్న స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు.
గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు రూ.50 లక్షలిచ్చామని కురుమ సంఘం రాష్ట్ర నాయకుడు మాదారం కృష్ణ అన్నారు. ఎన్ని సార్లు అడిగినా డబ్బులివ్వకుండా తప్పించు తిరుగుతున్నాడన్నారు. చివరికి రూ.25 లక్షలిచ్చాడని మరో రూ. 25 లక్షలు రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర కురుమ సంఘం ఎన్నికల్లో ప్యానెల్-2 కింద అధ్యక్షుడిగా దొడ్డి శ్రీనాథ్, ప్రధాన కార్యదర్శిగా కర్కె సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్గా మాదారం కృష్ణ, యువజన విభాగం అధ్యక్షుడిగా అడికె సంతోశ్ పోటీలో ఉన్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు మంగ నర్సింహులు, ఒగ్గు భిక్షపతి, గౌడ శ్రీశైలం, ఆత్కూరి అయిలయ్య, కర్రె సిద్ధులు, కర్రె చంద్రశేఖర్, మోటె శేఖర్, ఎడపెల్లి కరుణాకర్, కాదూరి కరుణాకర్ పాల్గొన్నారు.