‘హుజూర్నగర్ నియోజకవర్గం గతంలో ఎట్లుండే, నేడు ఎట్ల మారింది. సైదిరెడ్డి నాయకత్వంలో చాలా పనులు చేశాం. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్డీఓ కార్యాలయాన్ని నేనే ప్రారంభించా. నేరేడుచర్లను మున్సిపాలిటీ చేసుకొని అభివృద్ధి చేసుకుంటున్నం. ఈఎస్ఐ ఆసుపత్రి వచ్చింది, సిమెంట్ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులకు మేలు జరిగింది. ఇక్కడ చాలా లిఫ్ట్ పనులు పెండింగ్లో ఉన్నాయి. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఉత్తమ్కుమార్రెడ్డి చేసిందేమీ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వందల కోట్లతో ముక్త్యాల, జాన్పహాడ్ లిఫ్ట్ పనులను ప్రారంభించింది. అన్ని కాల్వలకు లైనింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఉత్తమ్కుమార్రెడ్డి గతం, సైదిరెడ్డి భవిష్యత్.
ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే సైదిరెడ్డిని ఆశీర్వదించి మరోమారు అసెంబ్లీకి పంపించాలి. ఇక్కడ కావాలని కోరుతున్న నైపుణ్య శిక్షణ కేంద్రంతోపాటు అన్నీ చేస్తాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. హుజూర్నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి మద్దతుగా గురువారం నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ముళ్ల చెట్టుకు నీళ్లు పోసి పండ్లు కావాలంటే రావని, అభివృద్ధి చేసే సైదిరెడ్డిని కాదని ఉత్తమ్కుమార్ రెడ్డిని ఆదరిస్తే మిగిలేది కన్నీళ్లేనని అన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే కరెంట్ ఉండదని, కర్ణాటకలో ఆ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు కావడం లేదని తెలిపారు. వర్షంలోనూ నియోజకర్గ వ్యాప్తంగా వచ్చిన ప్రజలతో హుజూర్నగర్ గులాబీమయమైంది.
సూర్యాపేట, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : హుజూర్నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని గెలిపించి మరోసారి అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. సైదిరెడ్డి ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత కోట్లాది రూపాయలు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారన్నారు. ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఉత్తమ్కుమార్రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. హుజూర్నగర్కు ఉత్తమ్ గతమని, సైదిరెడ్డి భవిష్యత్తు అని పేర్కొన్నారు. సైదిరెడ్డి గెలుపును కాంక్షిస్తూ గురువారం హుజూర్నగర్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
హుజూర్నగర్ నియోజకవర్గం గతంలో ఎట్లుండె.. నేడు ఎట్ల ఉన్నదని ప్రశ్నించారు. సైదిరెడ్డి నాయకత్వంలో చాలా పనులు చేశామని, ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఆర్డీఓ కార్యాలయాన్ని ప్రారంభించామని తెలిపారు. నేరేడుచర్లను మున్సిపాలిటీ చేసుకుని అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రి వచ్చిందని, దాంతో సిమెంట్ ఫ్యాక్టరీల్లో ఉండే కార్మికులకు లాభం జరిగిందని పేర్కొన్నారు. ఇక్కడ చాలా లిఫ్ట్లు ఉన్నాయని, ఉత్తమ్ హయాంలో ఒక్కటి కూడా మరమ్మతులు చేయలేదని విమర్శించారు. సైదిరెడ్డి హయాంలో రూ.1,770 కోట్లతో ముక్త్యాల, జాన్పహాడ్ లిఫ్ట్ల పనులు ప్రారంభం చేశామని, మళ్లీ గెలిచి సైదిరెడ్డే కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవం చేస్తారని అన్నారు. రూ.370 కోట్లతో అన్ని కాల్వల సీసీ లైనింగ్ పనులు జరుగుతున్నాయని చెప్పారు.
రేపు జరుగబోయేది సాదాసీదా ఎన్నికలు కావు.. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు.. ఉన్నా ఇవ్వమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకే ఓటేసే ముందు కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలా? ఆలోచన చేయాలని ప్రజలకు సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కర్ణాటకలో కరెంటు ఐదు గంటలకు మించి ఇవ్వట్లేదని తెలిపారు. మళ్లీ ఆ దరిద్రం మనకు కావాలా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార దాహంతో గోతికాడి నక్కలా కూర్చుని ఆవురావురంటున్నారన్నారు. అధికారంలోకి వచ్చి రాగానే మొత్తం రాష్ర్టాన్ని మింగేయాలని ఎదురు చూస్తున్నారని దుయ్యబట్టారు.
రేపు జరుగబోయే ఎన్నికల్లో ఇటు రెండేండ్లలోనే కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి యువకుడు సైదిరెడ్డి ఉంటే.. అవతల రెండు సార్లు అధికారంలో ఉండి కూడా ఏమీ చేయని కాంగ్రెస్ ముసలి నక్క ఉన్నదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. గతంలో గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి ఎన్ని వేల కోట్ల కుంభకోణం చేశాడో గుర్తు చేసుకోవాలన్నారు. ముళ్ల చెట్టుకు నీళ్లు పోసి పండ్లు రావాలంటే రావని, అభివృద్ధి చేసే సైదిరెడ్డిని కాదని, ఉత్తమ్ను ఆదరిస్తే మీకు మిగిలేది ముళ్లే అని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఉత్తమ్కుమార్రెడ్డి గతంలో కాంగ్రెస్ గెల్వకుంటే గడ్డం తీయనని శపథం చేశాడని, మరి కాంగ్రెస్ గెల్వకున్నా గడ్డం మాత్రం తీసిండని ఎద్దేవా చేశారు.
ఈ సారి అధికారంలోకి రాగానే ఏమేం ఇస్తామో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే మ్యానిఫెస్టోలో వివరించారని, ఈ సారి అందరికీ బోనాంజనే అని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతుబంధు రూ.10వేల నుంచి రూ.16 వేలు చేస్తుండగా, సౌభాగ్యలక్ష్మి పథకం పేరిట 18 ఏండ్లు నిండిన మహిళలకు నెలకు రూ.3వేలు, ఆసరా పింఛన్లు రూ.2వేల నుంచి రూ.5వేలు చేస్తామని హామీ ఇచ్చారు. రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, 800 రూపాయలను సబ్సిడీ రూపంలో మన ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇస్తామని, ఐదు లక్షల బీమా అందిస్తామని చెప్పారు. ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి.. నైపుణ్య శిక్షణ కేంద్రం కావాలని సైదిరెడ్డి కోరుతున్నాడని తెలిపారు. సైదిరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే నైపుణ్య శిక్షణా కేంద్రంతోపాటు అన్నింటినీ ఇస్తామని హామీ ఇచ్చారు.
నేరేడుచర్ల, నవంబర్ 23 : ఉప ఎన్నికల్లో గెలిచిన నాలుగు సంవత్సరాల్లో రూ.4వేల కోట్లతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కోరారు. నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించేందుకు నిత్యం ప్రజల మధ్యే ఉంటూ కృషి చేస్తున్నానని అన్నారు. ఇక్కడే పుట్టి పెరిగిన బిడ్డగా ఇక్కడి ప్రజల సమస్యలు తనకు తెలుసని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్కుమార్రెడ్డికి పదవులపై యావ తప్ప.. నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి లేదని విమర్శించారు. గతంలో గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేక రోడ్లన్నీ బురదమయంగా కనిపించేవని, నేడు సీసీ రోడ్లు వేయడానికి ఖాళీ లేదని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనేది ప్రజల నమ్మకమని, ఆ నమ్మకమే తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న ఎంతో మందికి ఎల్ఓసీలు ఇప్పించి వారి ప్రాణాలను కాపాడానని తెలిపారు. ఉత్తమ్ మాయమాటలు నమ్మి మోసపోకుండా కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.
నేరేడుచర్ల/ హుజూర్నగర్, నవంబర్ 23 : బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపును కాంక్షిస్తూ గురువారం హుజూర్నగర్లో నిర్వహించిన ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రోడ్ షో సూపర్ సక్సెస్ అయ్యింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి గులాబీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలి రావడంతో హుజూర్నగర్ పట్టణం గులాబీమయమైంది. వాన పడుతున్నా లెక్క చేయకుండా జనం రోడ్ షోలో పాల్గొన్నారు. గురువారం తెల్లవారుజాము నుంచే జల్లులు పడుతున్నప్పటికీ యువ నేత కేటీఆర్ను చూసేందుకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రజలు ద్విచక్ర వాహనాలు, డీసీఎంలు, ట్రాక్టర్లు, ఆటోల్లో పెద్ద సంఖ్యలో హుజూర్నగర్కు చేరుకున్నారు.
ఉదయం 11గంటలకు ప్రారంభం కావాల్సిన రోడ్ షో వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యమైంది. అప్పటికే వచ్చిన పార్టీ అభిమానులు, కార్యకర్తలు తమ అభిమాన నాయకుడి కోసం వర్షంలోనూ ఎదురు చూశారు. జోరు వానలో 1:52 గంటలకు హెలికాప్టర్లో వచ్చిన మంత్రి కేటీఆర్.. రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని చౌరస్తా వద్ద 2:29 నుంచి 2:46 గంటల దాకా ప్రసంగించారు. వర్షం పడుతున్నా కదలకుండా ఉన్న కార్యకర్తలు మంత్రి ప్రసంగానికి ఈలలు, చప్పట్లతో జేజేలు పలికారు. రోడ్ షో సూపర్ సక్సెస్ కావడం బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత జోష్ నింపింది.
కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాసోజు శంకరమ్మ, గట్టు శ్రీకాంత్రెడ్డి, రమణానాయక్, జిన్నారెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీలు పార్వతి, లకుమళ్ల జ్యోతి, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, జగన్నాయక్, హుజూర్నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వర్రావు, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు షేక్ ఇమ్రాన్ ఖాన్, నాయకులు అమర్నాథ్రెడ్డి, అమర్, హరిబాబు, కేఎల్ఎన్ రెడ్డి, రంగాచారి, నగేశ్రాథోడ్, కడియం వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు నాగేశ్వర్రావు, ఉపేంద్ర, సౌజన్య, ఫణికుమారి, మంగమ్మ, గోపి, శంభయ్య, గంగరాజు, అస్మా పాల్గొన్నారు.