దేవరకొండ రూరల్, సెప్టెంబర్ 15 : గొట్టిముక్కల రిజర్వాయర్తో 25వేల ఎకరాలకు సాగునీరు అందించి దేవరకొండ మండలాన్ని సస్యశ్యామలం చేయబోతున్నామని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మండలంలోని గొట్టిముక్కల గ్రామ శివారులో నిర్మిస్తున్న గొట్టిముక్కల రిజర్వాయర్ను శుక్రవారం ఆయన సందర్శించి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్షా 50వేల ఎకరాలకు సాగు నీరందించే డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును రూ.3,164 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. ఇందులో అంతర్భాగంగా నియోజకవర్గంలో గొట్టిముక్కల, సింగరాజుపల్లి, కిష్టరాంపల్లి, చింతపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
గొట్టిముక్కల ప్రాజెక్టును రూ.178 కోట్లతో 1.84 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించామని తెలిపారు. వర్షం నీరు వృథాగా పోకుండా ఈ రిజర్వాయర్లో నిల్వ చేసి మండలంలోని 25వేల ఎకరాలకు సాగు నీరందిస్తామని, దాంతో మండలం సస్యశ్యామలంగా మారబోతున్నదని తెలిపారు. దీనివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ఈ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన లింగన్నబావి, పూతలరాంతండాకు చెందిన 110 మంది రైతులకు చింతపల్లి దగ్గర, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందించామని చెప్పారు. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేశామని తెలిపారు. క్షామ పీడిత ప్రాంతాన్ని రిజర్వాయర్ల నిర్మాణాలతో సస్యశ్యామలంగా మార్చిన సీఎం కేసీఆర్కు ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారన్నారు. జడ్పీటీసీ అరుణాసురేశ్, వైస్ ఎంపీపీ సుభాశ్, సర్పంచ్ అయ్యన్న, ఎంపీటీసీ సైదమ్మ, పీఏసీఎస్ చైర్మన్ ప్రవీణ్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.ర