వినాయక్నగర్, జనవరి 28: నిజామాబాద్ జిల్లా కేంద్రాన్ని అడ్డాగా చేసుకొని సాగుతున్న మట్కాపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ బాస్ నిర్ణయించారు. ఇందులో భాగంగానే వారం రోజుల క్రితం కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ బృందం మట్కా నిర్వాహకుడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఐదేండ్లుగా చాపకింద నీరులా మట్కాను కొనసాగించిన మహ్మద్ జమీర్ అనే నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం జమీర్ను కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసులు.. అతనితో సంబంధాలు ఉన్న, లావాదేవీలు జరిపిన మిగతా ఏజెంట్లతోపాటు పార్ట్నర్లు, సభ్యుల వివరాలను తెలుసుకున్నారు. నిందితుడు ఇచ్చిన వివరాల ఆధారంగా ప్రత్యేక పోలీసు బృందాలు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.
పోలీసుల కస్టడీలో ఉన్న అంతర్రాష్ట్ర మట్కా బెట్టింగ్ నిర్వాహకుడు ఇచ్చిన సమాచారంతో నిందితులను పట్టుకునేందుకు సీపీ కల్మేశ్వర్ ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడు మహారాష్ట్రలోని నాందెడ్, ధర్మాబాద్, బిలోలి, వర్ధ, అకోలా, అమరావతి తదితర ప్రాంతాల్లో ఉన్న మట్కా నిర్వాహకుల పేర్లు తెలుపడంతో నార్త్ రూరల్ సీఐ సతీశ్కుమార్ ఆధ్వర్యంలో సంబంధిత ఐదో టౌన్ పోలీసులు మిగతా నిందితుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. సుమారు 10 కన్నా ఎక్కువ మంది మట్కా బెట్టింగ్లో పాత్రధారులుగా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు సైతం నిందితుడితో లావాదేవీలు నిర్వహించినట్లు తేలడంతో వారి పేర్లను సైతం పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. దీంతో మిగతా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు నిందితుడు జమీర్ కూడబెట్టిన ఆస్తుల వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
జిల్లా ప్రజలు మట్కా ఏజెంట్లను నమ్మి మోసపోవద్దు. మట్కా ఆడినా, నిర్వహించినా, బుకీలుగా వ్యవహరించిన వారిపై చట్టరీత్యా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం.