కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి
తొలి రోజు పరీక్షలు ప్రశాంతం
రామగిరి, మే 6 : ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయగా ఉదయం 8గంటలకే విద్యార్థులతో సందడి నెలకొంది. నిమిషం ఆలస్యమైతే అనుమతి ఉండదని అధికారులు ప్రకటించడంతో నిర్ణీత సమయానికి ముందే చేరుకున్నారు. కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులు శానిటైజర్, వాటర్ బాటిళ్లను ప్రత్యేకంగా వెంట తెచ్చుకున్నారు. రెండు కేంద్రాల వద్ద ఆలస్యంగా వచ్చిన ముగ్గురు విద్యార్థులకు అధికారులు అనుమతి నిరాకరించారు. జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాలను డీఐఈఓ దస్రూ, పరీక్షల విభాగం అధికారులు పర్యవేక్షించారు. 31మండలాల్లోని 51 పరీక్ష కేంద్రాల్లో 17,206మందికి గాను 16,194మంది హాజరయ్యారు. 1,012మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ తెలిపారు.
హాజరు ఇలా…
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు రెగ్యులర్ 14,111మంది, ఒకేషనల్ 3,095మంది కలిపి మొత్తం 17,206మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. అయితే శుక్రవారం మొదటి పేపర్కు రెగ్యులర్ విభాగంలో 13,417 మంది, ఒకేషనల్లో 2,777మంది కలిపి మొత్తం 16,194మంది హాజరయ్యారు. రెగ్యులర్ 694, ఒకేషనల్లో 318మంది కలిపి 1,012మంది గైర్హాజరయ్యారు.
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్…
జిల్లా అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ జిల్లా కేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రభుత్వ బాలికల, గీతాంజలి జూనియర్ కళాశాలలను పరిశీలించి పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.
సూర్యాపేట జిల్లాలో..
8,426 మంది హాజరు, 620 మంది గైర్హాజరు
సూర్యాపేట అర్బన్, మే 6 : సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా పారంభమయ్యాయి. మొదటి రోజు నిర్వహించిన తెలుగు, సంస్కృతం పేపర్కు 9,046 మందికి గాను 8426 మంది హాజరయ్యారు. గైర్హాజరైన వారిలో 422 మంది రెగ్యులర్, 198 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షా కేంద్రాలను ఇంటర్మీడియట్ అధికారి ప్రభాకర్రెడ్డి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి రోజు మాల్ ప్రాక్ట్రీస్ కేసులేమీ నమోదు కాలేదని తెలిపారు.