నల్లగొండ రూరల్/సూర్యాపేట అర్బన్, ఫిబ్రవరి 27 : ఇంటర్మీయట్ వార్షిక పరీక్షలకు అధికార యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. నేటి నుంచి మార్చి 16 వరకు కొనసాగున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే విద్యార్థుల హాల్ టికెట్లను విడుదల చేశారు. పరీక్షల నిర్వహణ సీసీ కెమెరాల నిఘాలోనే జరుగనున్నది. ఈ సారి కూడా నిమిషం నిబంధన అమలు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు గంట ముందే చేరుకోవాల్సి ఉంటుంది.
నల్లగొండ జిల్లాలో 50 కేంద్రాలు..
పరీక్షల కోసం నల్లగొండ జిల్లాలో 50 సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 32,695 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం 17,654 మంది, ద్వితీయ సంవత్సరం 15,041 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రథమ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు 12,507, ఒకేషనల్ 5,147 మంది, ద్వితీయ రెగ్యులర్ 12,741 మంది, ఒకేషనల్ 2,300 మంది ఉన్నారు. ఫ్లయింగ్ స్కాడ్స్ 2, సిట్టింగ్ స్కాడ్స్ 4 బృందాలు పరీక్షల నిర్వహణను పరిశీలించనున్నాయి.
సూర్యాపేట జిల్లాలో 32 కేంద్రాలు..
పరీక్షల కోసం సూర్యాపేట జిల్లాలో 32 సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 16,602 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం 8,285 మంది, ద్వితీయ సంవత్సరం 8,317 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో ప్రతి సెంటర్కు ఒక సూపరింటెండెంట్ చొప్పున 32 మందిని నియమించారు. వారితోపాటు 32 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇద్దరు ఫ్లయింగ్ స్కాడ్స్, ముగ్గురు సిట్టింగ్ స్కాడ్స్ను ఏర్పాటు చేశారు.
సెంటర్ను గుర్తించేందుకు యాప్
సీసీ కెమెరాల ఎదుటే ప్రశ్న పత్రాలను విడుదల, సమాధాన పత్రాలను సీల్ చేయడం వంటివి కొనసాగుతాయి. సమీప పోలీస్ స్టేషన్ల నుంచి పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలను సరఫరా చేసే బాధ్యత కస్టోడియన్లకు అప్పగించారు. పరీక్ష కేంద్రాలను గుర్తించేందుకు సెంటర్ లొకేటర్ యాప్ను రూపొందించారు. అందులో హాల్ టికెట్ నంబర్ నమోదు చేస్తే విద్యార్థి ఉన్న ప్రదేశం నుంచి పరీక్షా కేంద్రం ఎంత దూరంలో ఉన్నది, అక్కడికి ఎలా చేరుకోవాలనేది ఈ యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. వేసవి దృష్ట్యా విద్యార్థులకు తాగునీటి సౌకర్యంతో అందుబాటులో వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. పరీక్షల నిర్వహణలో ఏ సమస్యలు ఉన్నా టోల్ ఫ్రీ 14416 నంబర్కు కాల్ చేయాలని అధికారులు సూచించారు.
హాల్ టికెట్ ఇవ్వని కళాశాలలపై చర్యలు : డీఐఈఓ
ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వని ప్రైవేట్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కృష్ణయ్య హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ప్రతిభ కళాశాల పరీక్షా కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.